తెలంగాణలోని షాద్నగర్లో జరిగిన యవతి హత్య సంచలనంగా మారింది.డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం కేసు పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది.
నవాబ్పేట్ మండలంలోని కొల్లూరు వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డి బుధవారం ఆసుపత్రికి వెళ్లింది.కాగా తాను తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైందని తన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది.
తన చెల్లితో ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం పోలీసులకు కీలకమైన సాక్ష్యంగా మారింది.తన స్కూటీ పాడైందని, రోడ్డుపై లారీ డ్రైవర్లు ఉన్నారని, తనకు భయమేస్తుందని వణుకుతూ ప్రియాంక రెడ్డి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా షాద్నగర్ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉందని సమాచారం రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.వారు ఆ మృతదేహం ప్రియాంక రెడ్డిదే అని గుర్తించడంతో పోలీసులు ఆ హత్య ఎవరు చేసుంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియాంక రెడ్డి తన చెల్లికి చివరిసారి ఫోన్ చేసినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నట్లుగా చెప్పిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ దిశగా వారు విచారణ చేపట్టి నిందితులను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రియాంక తన చెల్లితో చెప్పిన విధంగా అక్కడున్న లారీ డ్రైవర్లు ఆమెపై అఘాయిత్యం చేసి హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు వారు కృషి చేస్తున్నారు.