శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశ ప్రజలకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన అబ్దుల్ కలామ్ జీవితంపై బయోపిక్ లు తెరకెక్కించడానికి దర్శకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఎన్నో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న అతని కథ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే కచ్చితంగా అద్భుతమైన విజయం సొంతం అవుతుందని భావించి ఆ దిశగా నిర్మాతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అబ్దుల్ కలామ్ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించే అదృష్టం తెలుగు నటుడు, కమెడియన్ అలీకి దక్కింది.అంతర్జాతీయ స్థాయిలో జగదీష్ దానేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఇక ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడిచిపెట్టారు.అబ్దుల్ కలామ్ పాత్రలో అలీ పెర్ఫెక్ట్ గా సరిపోయాడు.
ఈ సినిమా ద్వారా అలీ పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా డిజిటల్ ఆన్ లైన్ ద్వారా వర్చువల్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ కలామ్ లాంటి అంతటి మహానుభావుడి పాత్రను తాను పోషించడం తనకు దక్కిన మహద్బాగ్యమని నటుడు అలీ వ్యాఖ్యానించారు.ఈ అవకాశం తనకు లభించినందుకు వెంకటేశ్వరునికి, జీసస్ కు, అల్లాకు నిత్యమూ మొక్కుతానని అన్నారు.
పింక్ జాగ్వార్ ఎంటర్ టెయిన్ మెంట్,హాలీవుడ్ మీడియా అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ డాక్టర్ కలామ్ పేరిట ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రారంభించాయి.ఈ ప్రారంభోత్సవంలో దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ, ఇండియాకు 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం బయోపిక్ నటుడు అలీకి 1111వ చిత్రం కావడం కాకతాళీయమని అన్నారు.