పై ఫోటోలో టీవీఎస్ మోపెడ్ పై కూర్చొన్న పెద్దాయన్ని చూశారా? ఆయన ఎవరో మీరు చెప్పగలుగుతారా? తీక్షణంగా చూడండి అతన్ని ఎక్కడో చూసినట్టు మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది.ఎందుకంటే ఆయన ఏడాది క్రితం వరకు ఓ జాతీయ స్థాయి పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ చక్రం తిప్పారు.అవును, మీరు అనుకున్నట్టే.
ఆయన మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి.కానీ ఆదివారం నాడు ఆయన ఒక పాత టీవీఎస్ పై ప్రయాణిస్తూ అత్యంత సాధారణ వ్యక్తిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఐతే ఆయన తన రాజకీయ జీవితానికి ఎందుకు స్వస్తి పలికారో తెలియదు కానీ తన లైఫ్ స్టైల్ ని మాత్రం పూర్తిగా మార్చేశారు.
ఆయన ఎప్పుడు? ఏ సందర్భంగా? ఇలా కొత్త మనిషిగా కనిపించారో తెలుసుకుంటే.ఏపీలో నిన్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లాలో పోలింగ్ జరిగింది.అయితే ఎన్.రఘువీరారెడ్డి తన సతీమణి సునీత తో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనంతపురం జిల్లాలోని గంగులవానిపాలెంలో పోలింగ్ కేంద్రానికి టీవీఎస్ పై వచ్చి షాకిచ్చారు.పంచ కట్టుకుని పక్క రాయలసీమ లుక్ లో కనిపించిన ఆయన పోలింగ్ కేంద్రానికి ఒక టీవీఎస్ బైక్ పైన వెళ్తుంటే చాలామంది ఫోటోలు, వీడియోలు తీశారు.
ఈ ఫోటోల్లో ఆయన నెరిసిన గడ్డం తో సరికొత్త వేషధారణలో కనిపించారు.
అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రైతు గా మారిన తర్వాత రఘువీరారెడ్డి చాలా సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.రఘువీరారెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో.‘నాలుగో విడత పంచాయితీ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో మా గ్రామపంచాయతీ గంగులవానిపాలెంలో నేను, నా భార్య సునీత ఓటు హక్కు వినియోగించుకున్నాం’ అని పేర్కొన్నారు.