వ్యాయామం చేస్తే గుండె పదిలంగా ఉంటుందని.గుండె ఆరోగ్యం బలోపేతం అవుతుందని వైద్యులు చెబుతుంటారు.
కానీ అదే వ్యాయామం గుండెకు ముప్పుగా మారుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు.ఎప్పుడైతే మితిమీరిన వ్యాయామం చేస్తారో అప్పుడు చేకూరాల్సిన ఆరోగ్య ప్రయోజనాల కంటే ఎక్కువగా నష్టమే జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
గుండె సామర్థ్యానికి మించి అధిక వ్యాయామం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే అనేక సంఘటనలు సాక్ష్యంగా నిలిచాయి.జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఎందరో చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా కన్నుమూసిన కన్నడ హీరో పునీత్ మరణించడానికి కూడా మితిమీరిన వ్యాయామమే కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.
సాధారణంగా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు గుండెపై ఒత్తిడి పడినట్లు అనిపిస్తోంది.
అలాంటప్పుడు తేలికైన వ్యాయామాలు చేయకపోతే.గుండె ఆరోగ్యం మరింత బలహీన పడే ప్రమాదం ఉంది.
ఇది సుదీర్ఘకాలంలో గుండె పోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువ.కుటుంబసభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో మరణిస్తే వారి రక్తసంబంధీకులు కఠిన వ్యాయామాలు చేసేముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
అలాగే దూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు కూడా కఠిన వ్యాయామాలు చేయరాదని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు.మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు, రక్తనాళాల్లో పూడికలు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అత్యంత కఠినమైన వ్యాయామాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరి రక్తంలో గడ్డలు కడుతుంటాయి.వీరు వర్కౌట్లు చేస్తున్న సమయంలో గుండె పోటుకు గురయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్లే నాళాల్లో 100% పూడికలు ఏర్పడితే అది గుండెపోటుకు దారితీస్తుంది.75 శాతం పూడికలు ఏర్పడినా.హార్ట్అటాక్ వచ్చే ముప్పు ఎక్కువ.అదే 30-40 శాతం రక్తనాళాల్లో పూడికలు ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే.అవి పూర్తిగా మూసుకుపోయే ఆస్కారం ఉంది.వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతిలో మంట, ఆయాసం వంటి లక్షణాలు కనిపించగానే వైద్యుని సంప్రదించాలి.
ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంతో మళ్లీ వ్యాయామం చేస్తే.గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.