భారతీయుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.
దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.
ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దీవాళీని జరుపుకుంటున్నారు.ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్హౌస్లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.
అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.ఇక అమెరికా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన యూఎస్ కాంగ్రెస్లో దీపావళిని గతవారం ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో పనిచేస్తున్న వారు, మరికొందరు భారత సంతతి ప్రముఖులు సమావేశమయ్యారు.
తాజాగా భారతీయ అమెరికన్ సమాజం గర్వపడేలా దీపావళీకి అరుదైన గౌరవం దక్కనుంది.దీవాళీ నాడు దేశవ్యాప్తంగా సెలవు దినంగా పరిగణించాలని కోరుతూ అమెరికన్ చట్టసభ సభ్యురాలు, డెమొక్రాట్ పార్టీకి చెందిన కరోలిన్ మలోని బుధవారం యూఎస్ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.ఇందుకు భారత సంతతి కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి సహా ఇండియా కాకస్ సభ్యులు మద్ధతు ప్రకటించారు.
ఈ ఏడాది ఆగస్టులో భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు కూడా మహాత్మాగాంధీకి అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన కాంగ్రెస్ మెడల్ను ప్రదానం చేయాలని కరోలిన్ ఓ బిల్లు తీసుకొచ్చారు.2016లో అమెరికా పోస్టల్ శాఖ దీపావళీ స్మారక స్టాంప్ను విడుదల చేయించే విషయంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు.అమెరికాలో భారతీయ కమ్యూనిటీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ అండగా నిలిచే కరోలిన్ శనివారం టైమ్స్ స్క్వేర్లో జరిగిన దీపావళీ వేడుకల్లో పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ట్వీట్ చేశారు.
కాగా.గత కొంతకాలంగా దీపావళి పండుగను సెలవుగా ప్రకటించాలని భారత సంతతి ప్రజలు అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఏడాది మే నెలలో న్యూయార్క్ అసెంబ్లీలో భారత సంతతికి చెందిన తొలి మహిళా సభ్యురాలు రాజకుమారి ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.