అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత సంతతి సిక్కు క్యాబ్ డ్రైవర్పై దాడి ఘటన పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే.భారత ప్రభుత్వం సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.
దీంతో అమెరికా ప్రభుత్వం స్పందించింది.ఈ ఘటన ఆందోళనకరమైనదిగా అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
వైవిధ్యం అమెరికాను బలోపేతం చేస్తుందని తెలిపింది.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.
జేఎఫ్కే విమానాశ్రయంలో సిక్కు క్యాబ్ డ్రైవర్పై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలతో తాము తీవ్రంగా కలతచెందామని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్వీట్లో పేర్కొంది.అలాంటి ద్వేషపూరిత నేరాలకు పాల్పడేవారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా వుందని ఆ ట్వీట్లో వెల్లడించింది.
సిక్కు క్యాబ్ డ్రైవర్పై దాడి విషయం తెలుసుకున్న న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ .ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరిన తర్వాత విదేశాంగ శాఖ నుంచి ఈ స్పందన వచ్చింది.
కాగా.అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు.ఈ ఘటనలో నిందితుడు.సిక్కు వ్యక్తి తలపాగాను లాగి కిందపడేశాడు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.అయితే జనవరి 4న ఓ వీడియోను నవజ్యోత్ పాల్ కౌర్ అనే మహిళ ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఇందులో బాధితుడిని పదే పదే కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తలపాగాను లాగడం కనిపిస్తోంది.
జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తుతెలియని వ్యక్తి ఈ వీడియో తీశాడని… దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదని నవజ్యోత్ తెలిపారు.
అయితే మన సమాజంలో ద్వేషం కొనసాగుతుందన్న వాస్తవాన్నిహైలైట్ చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పారు.దురదృష్టవశాత్తు సిక్కు క్యాబ్ డ్రైవర్లపై పదే పదే దాడులు జరగడాన్ని తాను చూశానని నవజ్యోత్ కౌర్ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పంజాబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.