అనంతపురం రాజకీయాలు వేడెక్కాయి.ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే జేసీ బ్రదర్స్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
గత నెల 24వ తేదీన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లడం తో పెద్ద వివాదమే నడిచింది.రెండు వర్గాలు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకున్నారు.
ఇక అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే వస్తోంది.ఇక్కడ గొడవలు చోటుచేసుకోకుండా అప్పటి నుంచి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తూనే వస్తున్నారు.
అలాగే గత కొద్ది రోజులుగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్న తీరుపై జేసీ బ్రదర్స్ పోరాటానికి దిగుతున్నారు.ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
దీనికి సంబంధించి పోరాటానికి దిగుతున్న దివాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రభాకర రెడ్డి సైతం దీక్షకు దిగుతున్నారు.
ఈ దీక్షను వినూత్న రీతిలో చేపట్టేందుకు జేసీ బ్రదర్స్ సిద్ధమయ్యారు.70 ఏళ్లకు పైగా వయస్సున్న వారు ఈ దీక్షలో కూర్చోవాలని పిలుపు ఇచ్చారు.ఈ దీక్షకు పోలీసుల నుంచి అనుమతి కోరినా ఇవ్వలేదని, కేవలం తాను తన అన్న దివాకర్ రెడ్డి నల్ల బట్టలతో మౌనంగా వెళ్ళి పత్రాలు అందజేస్తామని జెసి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
అయితే దీనిపై ప్రత్యర్థి వర్గమైన కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలోనే జేసీ బ్రదర్స్ ఈ విధంగా హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు.
ఒకవైపు పోలీసుల అనుమతి లేదని చెబుతున్న జేసీ బ్రదర్స్ కు పిలుపు ఇవ్వడంతో తాడిపత్రి లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా జెసి బ్రదర్స్ వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో, ఎమ్మెల్యే పెద్దా రెడ్డి, జేసీ బ్రదర్స్ ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, తాడిపత్రిలో పోలీసు కవాతు నిర్వహించారు.పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా శాంతియుతంగా ఆమరణ దీక్ష చేస్తామని, పోలీసులు అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని జేసీ బ్రదర్స్ ప్రకటించడంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.