జనసేన విషయంలో టీడీపీలో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.కొంతమంది జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం మెజార్టీ టీడీపీ నాయకుల్లో వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది టీడీపీ నేతలు అనవసరంగా జనసేన కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలుగుదేశం పార్టీ బలం, బలగం తో పోల్చుకుంటే చాలా తక్కువ అని, అసలు 2019 ఎన్నికల్లో జనసేన కు వచ్చిన సీట్లు ఓట్లు లెక్కన చూసుకుంటే ఆ పార్టీకి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా మొదటి నుంచి టీడీపీ జనసేన విషయంలో సానుకూలంగానే ఉంటూ , అన్ని విషయాల్లోనూ స్పందిస్తూ వస్తున్న , జనసేన మాత్రం టీడీపీ విషయంలో ఆ వైఖరి కనిపించలేదని, వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ ఎంతగానో పోరాటాలు చేసినా, అనేక మంది నాయకులు అరెస్ట్ అయినా, టీడీపీ పై సానుభూతి వ్యక్తం చేస్తూ, పార్టీకి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, ఆ పార్టీలో కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ వంటివారు కానీ స్పందించలేదు అనేది వారి వాదన.
జనసేన విషయంలో వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం వంటి ఘటనలను టీడీపీ ఖండించడమే కాకుండా అండగా నిలబడింది అని గుర్తు చేస్తున్నారు.2024 ఎన్నికల్లో వైసీపీ కి అధికారాన్ని దూరం చేయాలి అంటే జనసేన మద్దతు ఉండాల్సిందే కానీ, దాని కోసం ఇంతగా ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకు అనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం.ప్రస్తుతం జనసేన కు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే జనసేన లేకపోతే టీడీపీ కి రాజకీయ భవిష్యత్తు లేదనే అభిప్రాయం అటు జనసేన వర్గాలలోను , ఇటు జనాలలోను వ్యక్తమవుతోంది అనేది కొంతమంది టిడిపి సీనియర్ అభిప్రాయం.
ఈ వ్యవహారాలపై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వం పై అటు చంద్రబాబు ఇటు లోకేష్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారి కార్యక్రమాలు అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అనేక అడ్డంకులు సృష్టించింది అని, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అంటూ ఆయన గుర్తు చేస్తున్నారు.
పూర్తిగా జనసేన పైనే ఆధార పడకుండా టీడీపీ సొంత బలం పెంచుకునే విషయంలో అధినేత చంద్రబాబు దృష్టి పెట్టాలని, పొత్తుల విషయం ఎన్నికల సమయంలో చూసుకోవచ్చని, ముందు నుంచే జనసేన పార్టీతో పొత్తు విషయమై ఎక్కువగా ప్రస్తావించినా, ప్రాధాన్యం కల్పించినా, మొదటికే ముప్పు వస్తుందనేది ఆ పార్టీలోని మెజారిటీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది.