ఏపీ అధికార పార్టీ వైసీపీలో సమూల మార్పులు చేసేందుకు ఏపీ సీఎం జగన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు.ముఖ్యంగా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నాయకులను కట్టడి చేసి ప్రజలకు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.
వైసీపీలో జగన్ తర్వాత కీలకంగా వ్యవహరించడం, ప్రతిపక్షాల దూకుడుకు బ్రేక్ వేయడం, ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ జగన్ కు సలహాలు ఇస్తూ, పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారంపైనా ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ జరగడమే కాకుండా, మీడియాకు సైతం లీకులు అందుతున్నాయి.ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసిపి బాధ్యతలను చూస్తున్నారు.
త్వరలోనే విశాఖ కు రాజధాని తరలి వెళ్లనున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడే విజయసాయి ఫోకస్ పెట్టారు.ప్రతిపక్షాలను బలహీనం చేయడమే ప్రధాన ఉద్దేశం గా ఆయన వ్యవహరిస్తున్నారు.
అయితే ప్రతిపక్షాలతో పాటు, సొంత పార్టీ నేతలపైన విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి బహిరంగంగా విమర్శలు చేయడం,దానికి బహిరంగంగానే సదరు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వడం వంటివి బాగా హైలెట్ అయ్యాయి.
ఆ తరువాత సదరు ఎమ్మెల్యేలను జగన్ పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చారు.అయితే విజయసాయిరెడ్డి పూర్తిగా జగన్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీ శ్రేయస్సు కోసమే విజయసాయిరెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు అనే విషయమూ జగన్ కు తెలుసు.
కాకపోతే ప్రతి విషయమూ వివాదాస్పదం అవుతుండడం, ప్రతిపక్షాలతో పాటు, సొంత నేతలకూ ఆయన టార్గెట్ గా మారడం వంటి కారణాలతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు ఆయనను విశాఖ రాజకీయాల నుంచి తప్పించి పూర్తిగా ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేయాలనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి.అదీ కాకుండా గత కొంత కలంగా విజయసాయి రెడ్డి, వై వి సుబ్బారెడ్డి లకంటే, ప్రభుత్వ సలహాదారు, రాయలసీమ పార్టీ ఇన్చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి హవానే పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.తాజాగా విజయసాయిరెడ్డి వ్యవహారంపై ఈ చర్చ మొదలు కావడంతో జగన్ పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది.