ఏదైనా ఒక రాజకీయ పార్టీ తిరుగులేకుండా రాజకీయం చేస్తూ, సుదీర్ఘకాలం రాణించాలి అంటే తప్పనిసరిగా ఆ పార్టీ అధినాయకత్వం స్ట్రాంగ్ గా ఉండాలి.పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం.
వాటి ఆధారంగానే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది.ఇటువంటి లక్షణాలు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కనిపించేవి.
ఆ పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండడంతో తెలుగు తమ్ముళ్లు వాటిని పాటిస్తూ వచ్చేవారు.పార్టీ అధిష్టానం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా శిరసా వహిస్తూ పాటించేవారు.
అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీలో నెలకొన్న లోటుపాట్లను సరిచేస్తూ, ఎక్కడా ఎవరూ అసంతృప్తికి గురికాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చేవారు.కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పార్టీలో క్రమశిక్షణ ఎక్కడా కనిపించడం లేదు.దీనికి తోడు అధినేత చంద్రబాబు మానసికంగా బాగా బలహీన అయినట్లు కనిపించడంతో ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ పెంచకపోగా, తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి.
స్వయంగా అధినేత చంద్రబాబు ప్రజలను తిట్టి పోస్తూ, మీకు సిగ్గు ఉందా ? రోషం ఉందా అంటూ తమకు ఓట్లు వేయలేదని, జనాలు తప్పు చేశారు అంటూ తమ బాధను బహిరంగ సభలోనూ ప్రదర్శిస్తూ వస్తున్న ఎన్నో సంఘటనలు టీడీపీ గ్రాఫ్ ను బాగా తగ్గించాయి.
టీడీపీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన వారు చాలా మంది బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నా చంద్రబాబు ను బెదిరింపులకు గురి చేస్తుండటం, తాము చెప్పింది చేయకపోతే ఏం చేయాలో తెలుసునని, తామే గొప్ప లీడర్లు అన్నట్లుగా వ్యవహరించడం వంటి ఎన్నో తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి.
ఉదాహరణగా చూసుకుంటే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న , కేసినేని నాని మధ్య నెలకొన్న వివాదం తెలుగు దేశం పరువు ప్రతిష్ట ను మరింత గా దెబ్బ తీశాయి.
ఈ విషయంలో బాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో, నాయకులు ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని తమ కుమార్తె కేసినేని శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ముందుగానే ప్రకటించుకున్నారు.ఆ తరువాత బాబు ప్రకటించాల్సి వచ్చింది.
అయితే ఈ నిర్ణయం ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గానికి మింగుడు పడక పోవడంతో బహిరంగంగానే అసంతృప్తిని తెరపైకి తెచ్చాయి.బాబు ప్రస్తుతం చూస్తుంటే ఎవరిని ఏమి అనలేని పరిస్థితి.
ఎవరిని ఏమన్నా పార్టీలో వారు ఉండే పరిస్థితి లేదు.దీంతో ఎవరు ఏ విధంగా వ్యవహరించినా బాబు ఏమీ అనలేకపోవడంతో పార్టీలో నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తున్నారు.
గతంలో టీడీపీ లో కానీ, బాబు వ్యవహారశైలిలో కానీ ఈ వైఖరి ఎప్పుడూ చూడలేదు.