రాజకీయాల్లో రాణించాలంటే వారసత్వం ఒకటే అర్హత కాదు.ప్రతి దశలోనూ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
అలా కాకుండా బట్టి పట్టినట్లుగా కొన్ని కొన్ని అంశాలపై పట్టు సాధించి ఇదే రాజకీయమంటే అది ఎంతో కాలం నిలవదు.ఏదో ఒక సందర్భంలో అభాసుపాలు కావాల్సిందే.
ప్రస్తుతం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు సంబంధించి ఇదే చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది.లోకేష్ ను ప్రమోట్ చేసేందుకు మిగిలిన నాయకులను తక్కువ చేసి చూపిస్తున్నారు అనే అభిప్రాయాలు తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది.
పార్టీలో కొద్ది నెలల క్రితం పెద్ద ఎత్తున పదవులను భర్తీ చేశారు.ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న నాయుడు వంటి రాజకీయ సీనియర్ లు ఉన్నారు.అయినా వారందరినీ పక్కనపెట్టి లోకేష్ ను మాత్రమే చంద్రబాబు ప్రమోట్ చేస్తుండడం, ఆయన పర్యటన కే టిడిపి అనుకూల మీడియా ఫోకస్ ఇవ్వడం, లోకేష్ బలమైన రాజకీయ నాయకుడిగా జనాలకు, పార్టీ నాయకులకు చూపించేందుకు మిగిలి ఉన్న నాయకులకు పెద్దగా ఫోకస్ లేకుండా చేయడం, పదవులు ఇచ్చినా వారు డమ్మిలు గానే మిగిలిపోవడం ఇవన్నీ ప్రస్తుతం టిడిపి లో చర్చనీయాంశంగా మారాయి.అసలు లోకేష్ కు రాజకీయ వ్యవహారాలు తెలీదు అని, ఆయనను అనవసరంగా ప్రమోట్ చేస్తూ , టిడిపిని మరింత ఇబ్బందులకు చంద్రబాబు గురి చేస్తున్నారని సొంత పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
అంతేకాదు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఇలా అందరూ లోకేష్ పైన విమర్శలు చేశారు.ఇటీవల కాలంలో పార్టీ పదవులు పొందిన నాయకులు ఎవరు పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.వారికి మాట్లాడే అవకాశం దొరకడం లేదు.ఏ విషయం పైన స్పందించాలన్నా, ఎక్కడ పర్యటించాలన్నా అది లోకేష్ మాత్రమే చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా ఉండడం, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ఇవన్నీ చంద్రబాబు సూచనల మేరకే అని, అందుకే మిగిలిన నాయకులకు ఫోకస్ లేకుండా చేసి లోకేష్ బాగా ప్రమోట్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది.దీనిపై సొంత పార్టీ సొంత సామాజిక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి .ప్రస్తుతం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్నాయి.
ఈ సమయంలో పార్టీ పదవులు పొందిన నాయకులంతా యాక్టివ్ గా ఉండేలా అందరికీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం కల్పించడం, ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, టిడిపి విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేసే అవకాశం ఉన్నా, కేవలం లోకేష్ కోసం ఎవరికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా చంద్రబాబు చేస్తున్నారనే విమర్శలు పార్టీలో నెలకొన్నాయి.