దుబ్బాక ఉప ఎన్నికల్లో
పార్టీ అభ్యర్థికి ఊహించని విధంగా విజయం దక్కడంతో, ఆ పార్టీలో ఎక్కడలేని సందడి కనిపిస్తోంది.అసలు పెద్దగా బలం లేదు అనుకుంటున్న సమయంలో టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం తమ ఖాతాలో వేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని, కాస్త గట్టిగా కష్టపడితే గ్రేటర్ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఆ తర్వాత, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చూపించవచ్చు అనే మంచి ఉత్సాహంతో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.
కేంద్ర బీజేపీ పెద్దలు సైతం తెలంగాణ పై ఫోకస్ పెంచారు.అయితే సహజంగానే తెలంగాణలో ఊపు రావడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న ఆంధ్రా పైనా బీజేపీ పెద్దల దృష్టిలో పడింది.
ఇక్కడ సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత, పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనిపించింది.అలాగే కోవర్ట్ అని ముద్ర వేయించుకున్న వారు అందరిని సోము వీర్రాజు పార్టీ నుంచి సాగనంపారు.
ఇక ఎవరు పార్టీ వ్యవహారాలలో అనుమానాస్పదంగా వ్యవహరించరాదని , పూర్తిగా బీజేపీ నియమ నిబంధనలు పాటిస్తూ, ఉండాల్సిందే అని ఖచ్చితమైన ఆదేశాలు ఆయన జారి చేయడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది.ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి కాస్త చేరికలు ఊపు అందుకున్నాయి.
టీడీపీలో ఉంటే వైసీపీ ప్రభుత్వం వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో, కొంతమంది కీలక నాయకులు బీజేపీ లోకి వెళ్ళిపోయారు.మరికొంతమంది వెళ్లే ఆలోచనలో ఉన్న సమయంలోనే, సోము వీర్రాజు పార్టీ నియమ నిబంధనల విషయంలో కఠినంగా ఉంటూ వస్తుండడం వంటి వ్యవహారాలతో చాలా మంది వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
ఆయన ఏ విషయంలోనూ ఎవరిమీద రాజీ పడకుండా ముక్కుసూటిగా ముందుకు వెళ్లడం వంటి కారణాలు రానున్న రోజుల్లో ఇబ్బందులకు గురిచేస్తాయి అనే భయంతో చాలామంది నాయకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో కీలక నాయకులు అంతా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ బాట పడతారు అని అంచనా వేసినా, బీజేపీలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారంతా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు అంటూ హడావుడిగా కమిటీలను ప్రకటించి భారీ ఎత్తున నాయకులతో వాటిని భర్తీ చేశారు.దీంతో టిడిపి నుంచి చేరికలకు దాదాపుగా బ్రేకులు పడ్డాయి.
అధికార పార్టీ వైసిపి సైతం కాస్త ప్రజాగ్రహం ఎదుర్కోవడం, ఆ పార్టీలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు వంటి కారణాలతో ఇప్పుడు ఎక్కడికక్కడ వలసలకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది.కానీ బిజెపి విషయంలో సోము వ్యవహారశైలిపై ఇప్పుడు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు సైతం వెళ్తున్నట్టు తెలుస్తోంది.