హుజురాబాద్ ఎన్నికల విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించింది.అలాగే బిజెపి నుంచి ఈటల రాజేందర్ అభ్యర్థిగా ఉన్నారు.
కానీ కాంగ్రెస్ నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అనే విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు.దీనికి కారణం ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల్లో బలమైన , గెలుపు అవకాశాలు ఉన్న నేతలు తక్కువగా ఉండడంతో, ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలా అని చాలా రోజులుగా కాంగ్రెస్ పెద్దలకు అర్ధం కావడం లేదు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వరంగల్ జిల్లా నేత కొండా సురేఖ పేరును రేవంత్ రెడ్డి పేరు తెరపైకి తీసుకువచ్చారు.ఆమె ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా అటు టిఆర్ఎస్ ఇటు బిజెపిని ఎదుర్కోగలరని, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంతో ఆమె పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు.
కాకపోతే రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం తీవ్రంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. నాన్ లోకల్ అయిన సురేఖను అభ్యర్థిగా నిలబెడితే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి అని, లోకల్ అభ్యర్థిని రంగంలోకి దించాలనే అభిప్రాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అయితే హుజూరాబాద్ నియోజకవర్గం బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని,నాన్ లోకల్ అభ్యర్థి అయినా ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ అభిప్రాయపడుతున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కొండా సురేఖ ముందుగా విముఖత వ్యక్తం చేసినా, ఆమె విధించిన కొన్ని షరతులను రేవంత్ అంగీకరిస్తూ ఆమెను అభ్యర్థిగా ఫైనల్ చేయగా, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం ఆమె పేరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.నిన్న జరిగిన పార్టీ సమావేశంలో ఇదే విషయమై చర్చ జరిగింది.అయితే అధికారికంగా తన పేరును ప్రకటించుకుని హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దిగకపోతే, సీనియర్ల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంటుందని, లేనిపోని ఇబ్బందులు వచ్చిపడతాయి అనే ఉద్దేశంతో సురేఖ సైతం ప్రచారానికి దిగడం లేదు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సురేఖ తప్ప మరో ఆప్షన్ కనిపించకపోవడంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా త్వరలో ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.