కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, అందాల తార కాజోల్ కి బాలీవుడ్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం అంటే వెంటనే ఎవరైనా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే అని చెబుతారు.ఈ సినిమాకి బాలీవుడ్ సినిమా చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది.ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకావ్యం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.1995లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును ఊపేసింది.నాలుగు కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 103 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఏ స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.హిందీ సినిమా అని అన్ని భాషల ప్రేక్షకులకి ఈ సినిమా చేరువ అయ్యింది.
ఇప్పటికి ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ప్రభావం చాలా కథలలో కనిపిస్తుంది.హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో బ్రేక్ అన్నది లేకుండా ఇరవై ఏళ్లకు పైగా ఈ చిత్రం ప్రదర్శించారంటే ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఇక ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడీ చిత్రాన్ని 18 దేశాల్లో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, యూకే, కెనడా, సౌదీ అరేబియా, యూఏఈ, నార్వే, స్వీడెన్, ఫిజీ, మారిషస్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, ఫిన్లాండ్, ఖతార్, ఎస్టోనియా దేశాలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.వీటితో పాటు మరికొన్ని దేశాలలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మొత్తానికి దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే అంటూ షారుక్, కాజోల్ జంట మరోసారి వెండితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యింది.ఇప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.