సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
అందుకే దర్శకుడు వంశీ పైడిపల్లి ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.దాదాపుగా 130 కోట్ల వరకు ఈ చిత్రం బడ్జెట్ వెళ్లిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే ఆ విషయంలో నిజం ఎంతుందో కాని వంద కోట్లను దాటి ఉంటుందని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.దిల్రాజు, అశ్వినీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఈ చిత్రం బిజినెస్ వ్యవహారాలు మొత్తం కూడా దిల్రాజుకు చిత్ర ఇతర నిర్మాతలు అప్పగించినట్లుగా సమాచారం అందుతోంది.దాంతో ఆయన తనకున్న అనుభవం దృష్ట్యా ఈ చిత్రంను విడుదలకు ముందే లాభాలు దక్కేలా అమ్మేయాలని భావిస్తున్నాడు.అందుకోసం అన్ని ఏరియాల్లో కూడా మహేష్ బాబు గత చిత్రాలు ఏవీ అమ్ముడు పోని స్థాయిలో రేటు చెబుతున్నాడు.రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకం కలిగిస్తూ అన్ని చోట్ల కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ను చేస్తూ దుమ్ము రేపుతున్నాడు.
ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ చిత్రంను 12 కోట్ల వరకు కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తిగా ఉన్నారు.కాని దిల్రాజు మాత్రం ఏకంగా 18 నుండి 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట.ఇలాగే అన్ని ఏరియాల్లో కూడా మహేష్ గత చిత్రాల కంటే అయిదు పది కోట్ల రూపాయలు ఎక్కువగా అమ్మేయాలని భావిస్తున్నాడు.దిల్రాజు ప్రయత్నం చూస్తుంటే ఖచ్చితంగా విడుదలకు ముందే నిర్మాతలు లాభాల బాటలో పడే అవకాశం కనిపిస్తోంది.