ఇళయదళపతి విజయ్ కోలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.అతని సినిమా రిలీజ్ అయ్యింది అంటే రెండు వందల కోట్ల కలెక్షన్ వస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు.
తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఇమేజ్ ఉందో విజయ్ కి కూడా అదే రేంజ్ లో ఇమేజ్ ఉంది.అతని సినిమాలకి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు.
దానికి తోడు తమిళ నేటివిటీ, సంప్రదాయాలకి పెద్ద పీట వేసే విధంగా అతని సినిమాలలో కనీసం ఒక్క సన్నివేశం అయినా ఉంటుంది.ఈ కారణంగానే విజయ్ సినిమాలకి కోలీవుడ్ లో అంతగా బజ్ ఉంటుంది.
విజయ్ చివరిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన మాస్టర్ మూవీ తెలుగులో పెద్దగా వర్క్ అవుట్ కాకున్నా తమిళంలో సూపర్ హిట్ అయ్యి రెండు వందల కోట్లకి పైగానే కలెక్షన్ రాబట్టింది.
ఇదిలా ఉంటే విజయ్ తో స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం కోసం బడా ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పటి నుంచో డేట్స్ కోసం ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే కేజీఎఫ్ స్టార్ యష్ డేట్స్ మైత్రీ దగ్గర ఉన్నాయి.అలాగే కోలీవుడ్ నుంచి విజయ్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేసిన కుదరలేదు.అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇళయదళపతి విజయ్ డేట్స్ ని దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే విజయ్ తెరి సినిమాని పోలీసోడు పేరుతో దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేశాడు.
అప్పటి నుంచి అతనితో మంచి సంబంధాలు ఉన్నాయి.ఈ నేపధ్యంలోనే దిల్ రాజు కోసం పాన్ ఇండియా మూవీ డేట్స్ ని విజయ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇక వంశీ పైడిపల్లిని దిల్ రాజు విజయ్ దగ్గరకి పంపించి స్టొరీ చెప్పించడం జరిగిందని, ఆ స్టొరీకి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం తమిళ్ లో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మూవీని విజయ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.