జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో సెంట్రల్ పాయింట్ కావాలని ప్రయత్నిస్తున్నారని ఇటీవల కాలంలో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నదని కొందరు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఒక్క రోజు దీక్ష చేశారు.
దీక్ష సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఏపీ సర్కారుపై విమర్శలు ఘాటుగానే ఉన్నాయని చెప్పొచ్చు.కాగా, తాజాగా పవన్ కల్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ పేరిట చేయబోయే ఉద్యమం విచిత్రంగా ఉందని పలువురు అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిజిటల్ ఉద్యమం చేయడం వలన ఏం ఉపయోగం ఉంటుందని పలువురు అడుగుతున్నారు.ట్విట్టర్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వాటిని వైసీపీ, టీడీపీ రెండు పార్టీల ఎంపీలకు ట్యాగ్ చేయాలనే పిలుపు ద్వారా ఏం ప్రయోజనం అని పలువురు అనుకుంటున్నారు.
ఈ విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతున్నది.
ట్విట్టర్లో నిరసన తెలపడం కాకుండా ప్రత్యక్ష పోరాటం చేస్తే బాగుంటుందని, పవన్ ఎందుకు ఆ విధంగా ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నారు.‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఎందుకు ప్రత్యక్ష క్రియాశీల ఉద్యమంలోకి అడుగు పెట్టడం లేదని అనుకుంటున్నారు.ఇకపోతే పవన్ ఎంత సేపటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని, టీడీపీని టార్గెట్ చేస్తున్నారని, తాను మిత్ర పక్షంగా ఉన్న బీజేపీని, కేంద్రాన్ని ఈ విషయమై గట్టిగా నిలదీయడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
పవన్ కల్యాణ్ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రైవేటీకరణ ఆపాలని వైసీపీ నేతలూ కోరుతున్నారు.మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జరిగే ప్రయోజనాలేంటనే ప్రశ్నకు జనసేన శ్రేణులు, అధినాయకుడు ఏం సమాధానం చెప్తారో మరి.పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో నికరంగా నిలబడితేనే ఏపీ రాజకీయాల్లో చోటు సంపాదించుకుంటారని, అలా కాకుండా కేవలం తనకు టైం ఉన్నపుడే పాలిటిక్స్ చేస్తూ ఇప్పటిలాగానే కొద్ది రోజులు సినిమా, కొద్ది రోజులు రాజకీయం చేసుకోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.