తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాల తర్వాత అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవాలయం కొండగట్టు అంజన్న క్షేత్రం.ఈ దేవాలయానికి ప్రతి మంగళ, శనివారాల్లో సుమారుగా 20 వేల నుంచి యాభైవేల మంది వరకు భక్తులు దర్శనానికి తరలివస్తారు.
ఇదీ గాక ఇక చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా అయితే మూడు నుంచి నాలుగు లక్షల మంది దీక్షాపరులు ఆలయంలో మాల విరమణ చేస్తారు.
ఇంతలా తెలంగాణలో పెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న అంజన్న ఆలయం మాత్రం ఇప్పటివరకు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది.
ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పోతుంది.ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్నానం చేసేందుకు కనీసం కోనేరులో నీళ్లు కూడా ఉండని దుస్దితి.
ఇక భక్తులు బస చేసేందుకు సరిగ్గా గదులు కూడా లేవు.ఉన్న అరకొర గదులు సరిపోవడం లేదు.
మరుగుదొడ్ల పరిస్థితి అయితే మరో అద్వానంగా ఉండగా, పారిశుద్ధ్యం గురించి అసలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఇక ఈ ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చుతున్నట్లు ఎనిమిదేళ్ల కిందటే ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసిన, ఇంతవరకూ ఆ ఊసే లేదు.
మాటల్లో ఉన్న వేడి చేతల్లో కనిపించడం లేదు.కానీ ఎవరైనా రాజకీయ ప్రముఖులు, అధికారులు వచ్చినప్పుడు మాత్రం అన్నీ వసతులు ఉన్నట్లుగా జాగ్రత్త పడి, వారు వెళ్లిపోగానే అసలు పట్టించుకోవటంలేదనే ఆరోపణలున్నాయి.
అదీగాక కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 66 మంది ప్రయాణికులు చనిపోయిన తర్వాత నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామని ప్రతిపాదనలు రూపొందించారు.ఇంతవరకూ ఆ రహదారి నిర్మాణం చేపట్టలేదు.
కాగా రానున్న చిన్న హనుమాన్ జయంతి వరకైనా కనీస మౌళిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.