టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీలో కొంతకాలంగా లుకలుకలు నడుస్తున్నాయి.2014 ఎన్నికల్లో హిందూపురంలో పోటీ చేసిన నవీన్ నిశ్చల్, ప్రస్తుత ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.ఇటీవల హిందూపురం ప్రెస్ క్లబ్ వేదికగా ఈ రెండు వర్గాలకు చెందిన పలువురు నేతలు రాళ్ల దాడులు చేసుకున్నారు.ఈ వ్యవహారం తాజాగా వైసీపీ పెద్దల వద్దకు చేరింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురంలోని పంచాయతీని పరిష్కరించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడుం బిగించారు.హిందూపురం వైసీపీ నేతలను మంగళవారం నాడు అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు.
అయితే మంత్రి పెద్దిరెడ్డి ఎదుటే ఒకరిపై ఒకరు రెండు వర్గాల నేతలు ఆరోపణలు గుప్పించుకున్నారు.పెద్దిరెడ్డి మందలించడంతో ఇరువర్గాల నేతలు వెనక్కి తగ్గారు.
ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ వర్గాలకు చెందినవారు మంత్రి పెద్దిరెడ్డికి ఇక్బాల్పై ఫిర్యాదు చేశారు.
హిందూపురం సమన్వయకర్తగా ఇక్బాల్ను కొనసాగిస్తే తాము పనిచేయలేమని మంత్రి పెద్దిరెడ్డికి నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ స్పష్టం చేశారు.
ఇక్బాల్ వల్ల తామంతా ఇబ్బందులు పడుతున్నామని, ఈసారి ఎన్నికల్లో ఇక్బాల్ కు కాకుండా ఎవరికి సీటిచ్చినా పర్వాలేదని, స్థానికులకు మాత్రమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.స్థానికేతరుడైన ఇక్బాల్ తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక్బాల్కు సీటిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
అటు తనపై నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ వర్గాలు మూకుమ్మడిగా ఫిర్యాదు చేయడం ఎమ్మెల్సీ ఇక్బాల్ అసహనానికి గురయ్యారు.పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తే తాను హిందూపురం నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమేనని ఇక్బాల్ తేల్చి చెప్పారు.అయితే ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి చేతులెత్తేశారు.
ఈ విషయం తాను తేల్చేది కాదని భావించి ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు తీసుకువెళ్లడానికి మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.వచ్చే ఎన్నికల నాటికి హిందూపురం వైసీపీలో లుకలుకలకు తెరపడాయేమో వేచి చూడాలి.