రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.కానీ ఒక్కో సారి నాయకులు చేసే విమర్శలు అప్పటి వరకు చేసిన పోరాటంతో ప్రజల్లో పెరిగిన ఆదరణ అంతా కనుమరుగైపోతుంది.
అలా అవుతుందని మాట్లాడిన సమయంలో ఊహించి ఉండరు.అయితే ఎవరినైతే విమర్శించామో వారు ఆ విమర్శను ఎలా తీసుకుంటారో, ఆ విమర్శతో ఎంతటి రాజకీయ ప్రకంపనలు రేగుతాయనేది మాత్రం ఎవరూ ఊహించలేని విషయం.
ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఇలానే ఉంది. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో బండి సంజయ్ రైతులను వరి పండించాలని చెప్పడంతో అక్కడ అగ్గి రాజేసింది.
కేంద్ర ప్రభుత్వం కొనే ప్రసక్తి లేదని స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా రైతులను మార్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఇక కెసీఆర్ దీక్ష చేసే పరిస్థితి వచ్చింది.
బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనే కాబట్టి దానిని రాజకీయం కోసం వాడుకోకుండా ఉండాల్సింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కెసీఆర్ విసిరిన సవాల్ కు బీజేపీ నుండి స్పందన రాకపోవడం తో ఈ పాయింట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళే అవకాశం ఉంది.హుజూరాబాద్ లో గెలిచి ఊపు మీద ఉన్న బీజేపీ బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యతో రైతుల ఆగ్రహానికి బలి కావలసి వచ్చింది.
ఏది ఏమైనా బండి సంజయ్ చేసిన ఈ తప్పు మిగతా రాజకీయ నాయకులు కూడా ఉదాహరణగా తీసుకుంటే ఓ ప్రతిపక్ష పార్టీగా చేస్తున్న పోరాటానికి ఒక సార్థకత దొరుకుతుంది.లేకపోతే రాజకీయంగా పెద్ద ఎత్తున నష్ట పోయే అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే కెసీఆర్ రాజకీయ అపర చాణక్యుడికి బీజేపీ రాజకీయ వ్యూహం అర్థం కాదు అని అనుకుంటే అదే అతి పెద్ద పొరపాటు అని మనం అనుకోవచ్చు.