ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అంతర్జాతీయ ప్రయాణీకులపై గట్టి నిఘా పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ‘not-at-risk’ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 2 శాతం పరీక్ష నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఢిల్లీ సర్కార్ అమెరికన్ ఎయిర్లైన్స్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో సదరు సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది.దీనిపై స్పందించిన ఎయిర్లైన్స్.
తాము మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది.
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‘ ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెంచింది పౌర విమానయాన శాఖ.‘ఎట్ రిస్క్‘ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కేవలం 2 శాతం మంది ర్యాండమ్ నమూనాల సేకరణలో ఉంటారని స్పష్టం చేసింది.వారు శాంపిల్ ఇచ్చాక విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.అయితే పరీక్ష ఖర్చు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.‘ఎట్ రిస్క్’ జాబితాలో లేని దేశాల నుంచి.రిస్క్ జాబితాలోని దేశాల విమానాశ్రయాల మీదుగా వచ్చిన వారికి ఎయిర్పోర్ట్లో కరోనా పరీక్షల నుంచి మినహాయింపు వుంటుంది.అయితే వారు స్వీయ వాంగ్మూల పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆన్ అరైవల్ టెస్టింగ్ కోసం అవసరమైన 2 శాతం మంది ప్రయాణీకులను న్యూయార్క్- ఢిల్లీ విమానంలోని సిబ్బంది గుర్తించలేదంటూ ఢిల్లీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మేరకు శుక్రవారం అమెరికన్ ఎయిర్లైన్స్కు నోటీసు జారీ చేసింది.
దీనికి స్పందించిన అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ.తమ కస్టమర్లు, సిబ్బంది ఆరోగ్యానికి తాము కట్టుబడి వున్నామని ప్రభుత్వానికి తెలిపింది.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కొత్త పరీక్షా విధానాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.ఈ కోవలో నిబంధనలు ఉల్లంఘించినట్లుగా నోటీసు అందుకున్న తొలి సంస్థ అమెరికన్ ఎయిర్లైన్సే.
కాగా.2012లో భారతదేశానికి సేవలను నిలిపివేసిన అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ .దశాబ్ధం తర్వాత న్యూఢిల్లీ- న్యూయార్క్ మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించింది.ఈ ఏడాది మార్చిలో సిలికాన్ వాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు నుంచి సీటెల్ మధ్య విమానాలను ప్రారంభించింది.
ఈ రెండు మార్గాల్లో ప్రయాణ రద్దీని బట్టి.భారతదేశ ఆర్ధిక రాజధాని ముంబైకి కూడా సర్వీసులను నడుపుతామని అమెరికన్ ఎయిర్లైన్స్ ఎండీ లాటిగ్ చెప్పారు.