రాజకీయాల్లో ప్రభావం చూపించే అంశాలు డబ్బు, కులం.ఈ రెండు లేకుండా రాజకీయం చేయడం చాలా కష్టం అన్న విషయం రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు.
అందుకే ఈ రెండు లెక్కలు పక్కాగా వేసుకుని మరీ అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటాయి.ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కులాభిమానంతో వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం కూడా సాధారణంగానే జరుగుతూ ఉంటుంది.
అందుకే ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరుగడం కూడా మనం చూస్తుంటాం.ప్రస్తుతం ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ కారణంగా క్రాస్ ఓటింగ్ గట్టిగా జరిగింది.
కొన్ని చోట్ల ఎంపీ ఓటు ఒక పార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరో పార్టీకి వేసిన ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.సహజంగా ఈ కుల ఈక్వేషన్లు ఎక్కువగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతుంటాయి.
అయితే ఈ సారి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా రాయలసీమ తో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఓటర్లు తమ కులానికి చెందిన అభ్యర్థికి ఓటు వేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపించారు.ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన వైసీపీ అధినేత జగన్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆ ప్రాంతంలో ఏ సామాజికవర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపి టీడీపీ నష్టపోయే విధంగా ప్లాన్ చేసారు.
అనంతపురం జిల్లాలో బీసీల ఓటింగ్ మెజార్టీ స్థాయిలో ఉంది.జగన్ ఈ ఎన్నికల్లో అనంతపురం, హిందూపురం రెండు లోక్సభ సీట్లను బీసీలకు ఇచ్చి చాలా వరకూ సఫలీకృతం అయ్యారు.
అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం లోక్సభ సీట్లను కూడా బీసీ వర్గానికి కేటాయించారు.
ఇక ఉత్తరాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళం లో కాళింగ సామజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే సామజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎంపీ సీటు ఇచ్చి బలమైన టీడీపీ అభ్యర్థి వెలమ సామజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకి చెక్ పెట్టారు.అలాగే విజయనగరం ఎంపీ పోటీలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు పోటీ చేయగా వైసీపీ తరపున తూర్పు కాపు సామజిక వర్గానికి చెందిన బెల్లాన చంద్ర శేఖర్ గట్టి పోటీ ఇచ్చారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ సామజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం వైసీపీ అభ్యర్థికి బాగా కలిసి వస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇలా కుల లెక్కలు చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ కులాల లెక్కల ఆధారంగా సీట్లు కేటాయించి జగన్ బాగానే సక్సెస్ అయ్యాడు అనే లెక్కలు తేలుతున్నాయి.