వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో నిత్యం ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంది.అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగన్ రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసినా ఆ క్రెడిట్ రాకుండా ఏదో ఒక అంశం వైసీపీ ప్రభుత్వానికి అడ్డుగోడగా మారుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది.
ఇప్పుడిప్పుడే పాలన ఒక గాడిలో పడుతోంది అనుకుంటున్న సమయంలో వైసీపీని ఇరుకునపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఛలో ఆత్మకూరు నినాదంతో పల్నాడు ప్రాంతంలో పర్యటించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధం అవ్వడం, ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం దీనిపై ఎక్కడలేని రచ్చ జరగడం జరిగిపోయాయి.ఈ వ్యవహారం చల్లబడింది అనుకుంటున్న సమయంలో ప్రభుత్వ వందరోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం వైసీపీని మరింత ఇబ్బంది పెట్టింది.
ఈ రాజకీయ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే వీటన్నిటి నుంచి ద్రుష్టి మరల్చడానికి అన్నట్టుగా వైసీపీ కొత్త ఎత్తులు వేసింది.టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకుంది.దీంతో ఏపీ రాజకీయాల్లోనూ,తెలుగుదేశం పార్టీలోనూ ఇది పెద్ద సంచలనమే రేపింది.
దీంతో కొంచెం రిలాక్స్ అవుతున్న వైసీపీకి అనుకోకుండా మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద టూరిజం బోటు బోల్తా పడి అతి పెద్ద విషాదం చోటుచేసుకుంది.
దాదాపుగా యాభై మంది వరకూ నీళ్ళల్లో మునిగి చాలామంది ఆచూకి లేకుండా పోయారు.అయితే ఇందులో వైసీపీ ప్రభుత్వానికి పెద్దగా సంబంధంలేని విషయమే అయినా దీనికి బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే.
అయినా సహాయ చర్యలు ముమ్మరం చేసి పోయిన పరువుని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో వైసీపీ సర్కార్ ఉంది.విషయం తెలిసిన వెంటనే జగన్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళడం, ఏరియల్ సర్వే చేపట్టి బాధితులను పరామర్శించడం చకచకా జరిగాయి.ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే అకస్మాత్తుగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడంతో వైసీపీ మీద టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శల డోసు పెంచింది.జగన్ ప్రభుత్వం వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ టీడీపీ పెద్దఎత్తున విమర్శలు చేస్తూ రాజకీయ రచ్చ రేపుతోంది.
ఇలా ఒక్కో సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుండడంతో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.