మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి పతనం అంచునకు చేరింది.శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండేకు ఏకంగా 42 శివసేన ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు.
దీంతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో పడింది.అయితే మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడం వెనుక మాజీ ముఖ్యమంత్ర, బీజేపీ నేత దేవేందర్ ఫడ్నవీస్ హస్తం ఉందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.
ఉద్ధవ్ థాక్రే మీద తమకు కోపం లేదని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెప్తున్నారు.శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలను వదిలిపెట్టి బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.ఏక్నాథ్ షిండే కూడా ఇదే డిమాండ్ను చేస్తుండటంతో ఇది బీజేపీ పక్కా ప్లాన్ అని తేలిపోయింది.
అటు శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేస్తోందని తాజాగా ఏకనాథ్ షిండే క్యాంపు నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యే నితిన్ దేశముఖ్ ఆరోపించారు.తనను బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారని మీడియా ముందు విమర్శలు చేశారు.
గుజరాత్లోని సూరత్కు తమను బలవంతంగా తరలించారని.అక్కడ ఒక ఆస్పత్రిలో ఇంజెక్షన్లు చేశారని ఆరోపించారు.
అంతేకాకుండా తాము పారిపోకుండా తమ చుట్టూ 200 మంది పోలీసులను కాపలాకు పెట్టారని మండిపడ్డారు.
మరోవైపు ఏక్నాథ్ షిండే శిబిరంలోని ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు.రెండున్నరేళ్లుగా ఇంటి తలుపులు మూసివేసి సొంత పార్టీ నేతలను విస్మరించారని ఆరోపించారు.ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసిన నేతలను ఈ రెండున్నరేళ్లలో కనీసం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కానీ ఏక్నాథ్ షిండే ఇంటి తలుపులు తమకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని సెలవిచ్చారు.అటు తిరుగుబాటు ఎమ్మెల్యేల కారణంగా ఉద్ధవ్ థాక్రే సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి వెళ్లిపోయారు.
ఉద్ధవ్ థాక్రే ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గంలో సంఖ్యా బలం అంకంతకూ పెరుగుతోంది.