1947లో భారతదేశం మత ప్రాతిపదికన రెండుగా విడిపోయినప్పటినుంచి ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది.బలవంతపు మత మార్పిడులు, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, ఆస్తుల ఆక్రమణ, విధ్వంసం ఇలా ఇతర మతస్తుల చేతిలో హిందువులు బలవుతున్నారు.
హిందువుల వ్యాపారాలు దెబ్బతీయడం, దుకాణాలను లూటీ చేయడం, తగలబెట్టడం పరిపాటిగా మారింది.కొందరు వీటిని పంటి బిగువున భరిస్తున్నా.
ఇంకొందరు మాత్రం తప్పనిసరి పరిస్ధితుల్లో వారికి లొంగిపోతున్నారు. ఇక ఇటీవల దుర్గా శరన్నవరాత్రుల సందర్భంగా బంగ్లాదేశ్లో జరిగిన హింస గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
బేగంగంజ్ అనే ఒక పట్టణంలో అల్లరిమూకలు మండపంలోకి చొరబడి దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆలయ కమిటీ సభ్యుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు.అక్కడితో ఆగకుండా కొంతమంది భక్తులను సైతం చంపేసి పక్కన ఉన్న చెరువులో పడవేశారు.
ఆ తర్వాత కొన్ని రోజుల పాటు హిందువులు, హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి.అల్లర్ల కారణంగా దేశంలోని 22 జిల్లాలలో ఇళ్ళు, గోదాములు, గడ్డివాములు, పశువులూ మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న లెక్కలకు మించి నష్టం వాటిల్లింది.అటు పాకిస్తాన్లోనూ దశాబ్ధాలుగా హిందువులు దినదినగండంగా బతుకుతున్న సంగతి తెలిసిందే.
మతచాందసవాదుల చేతుల్లో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ధ్వంసమయ్యాయి.హిందూ పూజారులు, మత పెద్దలు హత్యకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ పెద్దలు ఈ విషయాన్ని యూఎస్ కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రధానంగా కీలక నేత జేమ్స్ మెక్గవర్న్తో భేటీ అయ్యారు.పాకిస్తాన్, బంగ్లాదేశ్తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల గురించి ఆయనతో చర్చించారు.హౌస్ రూల్స్ కమిటీ ఛైర్మన్గా, చైనా వ్యవహారాలపై కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమీషన్ ఛైర్మన్గా, ద్వైపాక్షిక టామ్ లాంటోస్ మానవ హక్కుల కమీషన్ డెమొక్రటిక్ కో ఛైర్గా మెక్ గవర్న్వ్యవహరిస్తున్నారు.
హిందూ స్వయం సేవక్ సంఘ్ యూఎస్ఏ, వరల్డ్ హిందూ కౌన్సిల్, సేవా ఇంటర్నేషనల్, ఇస్కాన్, 75at75 ఫౌండేషన్, కాశ్మీరీ హిందూ ఫౌండేషన్, స్వామి నారాయణ్ బీఏపీఎస్ గ్రూప్, గ్లోబల్ ఇండియన్స్ ఫర్ భారత్ వికాస్, సహేలీ బోస్టన్ సహా పలు ఇండియన్ కమ్యూనిటీ సంస్థలు మెక్గవర్న్తో భేటీ అయ్యాయి.ఈ సందర్భంగా వరల్డ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ కౌల్.ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్లలో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న అకృత్యాలపై వివరాలను సమర్పించారు.కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లు, హిందూ వలసదారులపై జరిగిన దాడులను కూడా కౌల్ ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ లీడర్లు మెక్గవర్న్కు భగవద్గీతను బహూకరించారు.