కోవిడ్ సెకండ్ వేవ్తో భారతదేశం అతలాకుతలమవుతోంది.తొలి దశలో ఇంటి నుంచే కోలుకున్న జనం.
రెండో దశలో మాత్రం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.ఉత్పరివర్తనం చెంది మరింత శక్తిని పుంజుకున్న వైరస్.
శ్వాస వ్యవస్థపై నేరుగా దాడి చేయడంతో చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి.అందుకే వెంటిలేటర్, ఆక్సిజన్ కోసం ఎగబడుతున్నారు.
కానీ పెరుగుతున్న కేసులతో ఆసుపత్రుల్లో బెడ్లు, ప్రాణవాయువు కొరత వేధిస్తోంది.వైద్యులు రోగులను బ్రతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ మరణాలను నియంత్రించలేకపోతున్నారు.
ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత కారణంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది.క్లిష్ట పరిస్థితుల్లో వున్న దేశాన్ని ఆదుకునేందుకు, అందరికీ వైద్యం అందించేందుకు గాను అమెరికాలోని ఎన్ఆర్ఐ వైద్యులు నడుంబిగించారు.
దీనిలో భాగంగా భారత్లో పెద్ద ఎత్తున వున్న రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ)లకు కోవిడ్ చికిత్సపై శిక్షణ ఇస్తున్నారు.ఎందుకంటే భారతదేశ వైద్య రంగంలో ఆర్ఎంపీలదే కీలక పాత్ర.
గ్రామ గ్రామాన విస్తరించిన వీరి వల్లే మెజారిటీ వైద్యం అందుతోంది.అందువల్ల వీరికి కోవిడ్ చికిత్సపై అవగాహన కల్పిస్తే.
పట్టణాలు, నగరాల్లోని ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది.ఈ ఆలోచనతోనే ఎన్ఆర్ఐ వైద్యులు ముందడుగు వేశారు.
దీనిలో భాగంగానే వారంతా బృందంగా ఏర్పడ్డారు.అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వారితో పాటు భారత్లోని నిపుణులు కూడా ఈ 27 మంది బృందంలో పాలు పంచుకుంటున్నారు.
ఈ కార్యక్రమానికి ‘‘ప్రాజెక్ట్ మదద్’’ అని పేరు పెట్టుకున్నారు.కరోనా పరీక్షలు, చికిత్సా విధానాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలకు, ఆరోగ్య కార్యకర్తలకు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు.
గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఆర్ఎంపీలకు, హెల్త్కేర్ వర్కర్లకు సరైన శిక్షణ ఇవ్వడమే ప్రాజెక్టు మదద్ ఉద్దేశమని వీరు చెబుతున్నారు.ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని పలు గ్రామాల్లో ఇప్పటికే 150 మందికిపైగా ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చామని, వారితో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.కోవిడ్–19 లక్షణాలను గుర్తించడం, హై రిస్క్లో లేని వారికి హోమ్ ఐసోలేషన్లోనే చికిత్స అందించడం, వ్యాక్సినేషన్ వంటి వాటిపై ఆర్ఎంపీలకు శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు చెప్పారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించాలన్న ఆలోచనలో ఈ బృందం వుంది.
గ్రామాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా చికిత్సపై సరైన పరిజ్ఞానం లేనట్లు గుర్తించామని, అందుకే ప్రాజెక్టు మదద్కు శ్రీకారం చుట్టామన్నారు.