బిజెపి కార్పొరేటర్లు వారి అనుచరులతో జిహెచ్ఎంసి ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు.ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్దతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులు మనమే ధ్వంసం చేయడం సరియైన చర్య కాదు అని మేయర్ స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడం పై బిజెపి కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు పాల్పడటం వల్ల ప్రజలకు వ్యవస్థలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుందని మేయర్ తెలిపారు.
తనను కలిసేందుకు అపాయిట్మెంట్ ఇచ్చినప్పటికీ రాలేదని బిజెపి కార్పొరేటర్లు ఎందుకురాలేదో సమాధానం ఇవ్వాలన్నారు.ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు.
జిహెచ్ఎంసి అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యల పై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజిపడటంలేదన్నారు.
తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ ముంపుకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్ధేశంతో రాత్రింబవళ్లు తేడాలేకుండా పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయడం జరిగిందని, మేయర్ కార్యాలయం నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు.కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అయినా జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఆ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని గుర్తుచేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బిజెపి కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయ పరంగా ఈ రోజు ఈ గొడవ చేసారని, ఈ విషయం సహించరాదని అన్నారు.
ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.