కొన్ని దేశాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే, వారిని సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విషయంలో ఇతర మతాల వారి నుంచి వస్తున్నంత ప్రతిఘటన హిందువుల నుంచి రావడంలేదు.
వీరి సహనాన్ని తేలికగా తీసుకుంటున్న విదేశీయులు హిందూ దేవుళ్లను అవమానిస్తూనే ఉన్నారు.గతంలో చెప్పుల మీద, లోదస్తుల మీద హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించారు.
దీంతో విదేశాల్లోని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.అయినప్పటికీ ఈ నిరసనలను పట్టించుకోవడంలేదనేందుకు తాజా ఘటనను చెప్పుకోవచ్చు.
అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ వారు మహిళలు ధరించే ఈత దుస్తులపై (స్విమ్ వేర్) వినాయకుడి బొమ్మలను ముద్రించారు.వినాయకుడంటే భారతీయులకు ఎంత భక్తో తెలియంది కాదు.
ఏ పూజలోనైనా, ఏ శుభ కార్యక్రమంలోనైనా ప్రథమంగా పూజలు అందుకునే దేవుడు వినాయకుడే.వినాయక చవితి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ.
ప్రతి ఊరిలో, వాడవాడలా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఇలాంటి వినాయకుడిని అమెరికా కంపెనీ ఈత దుస్తులపై ముద్రించి హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసింది.
ఈ చర్యపై అమెరికాలోని నవేడాలో నిరసనలు వ్యక్తమయ్యాయి.ఈ స్విమ్ దుస్తులను మోడళ్లు ధరించి ప్రదర్శించడం అక్కడి హిందువులకు ఆగ్రహం తెప్పించింది.
యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం అధ్యక్షుడు రాజన్ జేద్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చూస్తే వెంటనే ఆ ఈత దుస్తులను నిషేధించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం స్టోర్సులో అమ్మకానికి ఉన్న ఈ దుస్తులను వెంటనే వెనక్కి తెప్పించుకోవాలన్నారు.
ఈ దుస్తులను తయారుచేసినందుకు కంపెనీ యజమానులు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.హిందూయిజం ప్రపంచంలోని మతాల్లో మూడో స్థానంలో ఉందని, ఇంతటి ప్రాధాన్యం ఉన్న మతాన్ని అవమానించారని వ్యాఖ్యానించారు.
హిందువులకు సహనం ఎక్కువని అంటారు.ఇతర మతాల వారు వారి దేవుడిని ఏ మాత్రం అవమానించినట్లు భావించినా ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తారు.
ప్రాణాలు కూడా తీస్తారు.కాని హిందువుల్లో ఇంతటి నిరసన ఎన్నడూ కనబడలేదు.
హిందూ దేవుళ్లను అవమానించడం ఉద్దేశపూర్వకంగా చేసే పని తప్ప మరోటి కాదు.