హృదయ సంబంధిత అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్ధి బెర్నీ శాండర్స్ డిశ్చార్జ్ అయ్యారు.శుక్రవారం సాయంత్రం నేవాడా ఆసుపత్రి వైద్యులు ఆయనను ఇంటికి పంపించినట్లు ప్రకటించారు.78 ఏళ్ల బెర్నీ శాండార్స్ ఈ వారం ప్రారంభంలో అస్వస్థతకు గురైన ఆయనను డిసెర్ట్ స్ప్రింగ్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్కు తరలించారు.
అక్కడి భారత సంతతి-అమెరికా వైద్యుడు డాక్టర్ అర్జున్ గురురాజ్ పరీక్షించి మయోకార్డియల్ ఇన్ఫార్క్సన్తో బాధపడుతున్నట్లు తెలిపారు.
సెనేటర్ శాండర్స్ ధమనుల్లో ఏర్పడిన అడ్డంకిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు ఆయన ప్రచార బృందం ప్రకటించింది.ఈ నేపథ్యంలో శాండర్స్ పాల్గొనాల్సిన అన్ని రకాల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత శాండర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.డిసెర్ట్ స్ప్రింగ్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ వైద్యులు, నర్సులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రిలో ఉన్న రెండున్నర రోజుల సమయంలో తనను కంటికి రెప్పలా చూసుకున్నారని శాండర్స్ కొనియాడారు.స్వల్ప విశ్రాంతి అనంతరం మళ్లీ తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు.
అలాగే తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులు, పార్టీ మద్ధతుదారులకు శాండర్స్ కృతజ్ఞతలు తెలిపారు.తాను బాగానే ఉన్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.