చదువు, ఉద్యోగం, వ్యాపారం పేరుతో ఎంతగా విదేశాలలో స్థిరపడినా భారతీయులు తమ మూలాలను మరిచిపోరనడానికి ఎన్నో ఉదాహరణలు.పరాయి దేశంలో ఉన్నప్పటికీ భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను మనవారు పాటిస్తూనే ఉన్నారు.
తాజాగా అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ సైతం తన హిందూ మూలాలను మరిచిపోలేదు.ఇందుకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
కాలిఫొర్నియా అటార్నీ జనరల్ పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో కమలా హారిస్ చెన్నైలోని తన అత్త సరళా గోపాలన్కు ఫోన్ చేశారు.తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనకు దేవుడి ఆశీస్సులు లభించేందుకు వీలుగా చెన్నై బీసెంట్ నగర్ వద్ద బీచ్కు సమీపంలో ఉన్న దేవాలయంలో కొబ్బరి కాయలు కొట్టాల్సిందిగా కోరింది.
కమలా హారిస్ కోరినట్లుగానే సరళ 108 కొబ్బరి కాయలు పగలగొట్టారు.హిందూ సాంప్రదాయంలో 108 సంఖ్యను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ విషయాన్ని 2018లో జరిగిన ఓ భారతీయ అమెరిన్ సమావేశంలో కమలా హారిస్ తెలిపారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో తెలిపింది.
ఆ ఎన్నికల్లో హారిస్ 0.8 శాతం ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.బీసెంట్ నగర్లోని బీచ్ వద్ద కమలా హారిస్ తన తాతయ్య గోపాలన్తో ఎక్కువగా గడిపేవారు.
బీచ్లో నడుచుకుంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకునేవారట.హారిస్ తాతగారు పీవీ గోపాలన్ తంజావూరు జిల్లా పైంగనాడు ప్రాంతానికి చెందినవారు.
ఆయన నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు.అనంతరం జాంబియాలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
పదవీవిరమణ తర్వాత గోపాలన్ ప్రతిరోజూ ఉదయం బీసెంట్ నగర్ బీచ్ వద్ద తన మిత్రులను కలిసేందుకు వెళ్లేవారు.
కమలా హారిస్ తన చిన్నతనంలో భారతదేశానికి వెళ్లినప్పుడు.
గోపాలన్ చిన్నారి కమలను తనతో పాటు బీచ్కు తీసుకెళ్లేవారు.ఆ సమయంలో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో యోధుల గురించి, ప్రజాస్వామ్య ప్రాముఖ్యత గురించి తాతయ్య ఎన్నో విషయాలు చెప్పేవారని కమలా హారిస్ 2018 నాటి తన ప్రసంగంలో చెప్పారు.
తన చిన్ననాటి జ్ఞాపకాల్లో తాతయ్యతో గడిపిన క్షణాలు తన జీవితంపై ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.కాగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్.
కమలా హారిస్ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.