అంతర్జాతీయ విద్యార్ధులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ప్రపంచంతో పాటు అమెరికాలోనూ రాజకీయ దుమారం రేపుతున్నాయి.వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో చదవబోయే విద్యార్ధులకు అమెరికాలోకి ప్రవేశం వుండదని ఐసీఈ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలాగే ఇప్పటికే అమెరికాలో ఉన్న వారు తమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లు న్యాయపోరాటానికి దిగాయి.
తాజాగా ప్రతిపక్ష డెమొక్రాట్లు సైతం ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.దీనిలో భాగంగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 136 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు భారత సంతతికి చెందిన కమలా హారిస్ సహా 30 మంది సెనేటర్లు ట్రంప్ అధికార యంత్రాంగంపై పోరాటానికి సిద్ధమయ్యారు.
ఈ మేరకు హోంలాండ్ సెక్యూరిటి విభాగానికి, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)కి లేఖలు రాశారు.ఈ కొత్త మార్గదర్శకాలు అంతర్జాతీయ విద్యార్ధులలో భయాందోళనలు సృష్టించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ లేఖలపై భారత సంతతి సెనేటర్లు రాబర్ట్ మెనెండెజ్, కోరి బుకర్, కమలా హారిస్ సంతకం చేశారు.ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తగదని వారు ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయ విద్యార్ధులను బలవంతంగా పంపించే ఈ చర్య క్రూరమైనదని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు.