రెండు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ కి వెళ్లారు.నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు.
కొద్ది నిమిషాల పాటు వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగినా, దానికి సంబంధించిన పరిణామాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.బిజెపి ,టిడిపి పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం ఊపందుకుందుకుంది.
చాలా ఏళ్లుగా చంద్రబాబు ను కలిసేందుకు ఇష్టపడని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడాన్ని దానికి సంకేతంగా టిడిపి శ్రేణులు చూపిస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే ఏపీలో రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి.
మొదటి నుంచి బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న వైసిపి పై ఈ మధ్యకాలంలో బిజెపి నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
కేంద్రం వైసీపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండగా, కేంద్రం పైన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి వంటి వారు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో టిడిపి, బిజెపి మధ్య సానుకూల వాతావరణం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది.దీనికి నిదర్శనంగా మొదటి నుంచి చంద్రబాబును వ్యతిరేకిస్తూ ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తోపాటు, బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి , బిజెపి రాజ్యసభ సభ్యుడు జేవీఎల్ నరసింహారావు వంటి వారు ఇప్పుడు చంద్రబాబును, తెలుగుదేశాన్ని పొగిడేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
అమరావతి విషయంలో చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసిన ఏపీ బీజేపీ నాయకులు ఇప్పడు చంద్రబాబును దర్శనికుడని, అమరావతికి ఒక ఆకారాన్ని తీసుకువచ్చారని, ఆయనే లేకపోతే అమరావతి ఇలా ఉండేది కాదు అంటూ పొగిడేందుకు ప్రయత్నిస్తున్నారు.కేంద్రంలో బాబుతో మోదీ భేటీ కావడం, ఏపీలో బిజెపి నాయకులు చంద్రబాబును పొగుడుతూ మాట్లాడడం, ఇవన్నీ బిజెపి టీడీపీ మధ్య పొత్తుకు సంబంధించి సానుకూల వాతావరణం పెంచేలా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ లోనూ , జాతీయ రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉండనని, రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతానని కేంద్ర బిజెపి పెద్దలకు హామీ ఇచ్చారని, చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగేందుకు ఏపీలో టిడిపి కి అనుకూలంగా బిజెపి మారేందుకు బాట వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.