ఢిల్లీ పోలీసులు భార్య భర్తల జంటను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.వారికి ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింక్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఐసిస్ కు అనుబంధం గా ఉందని భావిస్తున్న ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఖొరసాన్’ అనే మరో సంస్థతో కూడా టచ్ లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.సౌత్ ఢిల్లీలోని జామియానగర్ లో ఓ మారుమూల ఇంట్లో ఉన్న వీరు తమ గుట్టు బయటపడకుండా రహస్యంగా జీవిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.36 ఏళ్ళ జెహాన్ జబ్ సమి, 39 ఏళ్ళ అతని భార్య హీనా బషీర్ బేగ్.ఇద్దరూ ఢిల్లీ నగరంలో సీఏఏ వ్యతిరేక అల్లర్లను రెచ్ఛగొట్టినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఈ జంట కలిసి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సాధనాలతో ముస్లిం యువతను ఐసిస్ కి అనుకూలంగా మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా ఈ జంట నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
వీరు పలువురు సీనియర్ ఐసిస్ సభ్యులతోను, ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లతోను నిత్యం కాంటాక్టులో ఉండేవారని, సీఏఏ అన్నది బ్లాక్ లా అని, దీనివల్ల ముస్లిం లకు హాని కలుగుతుందని రాసి ఉన్న ఆర్టికల్స్ కూడా తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ఈ జంట దేశరాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిపేందుకు కూడా ప్లాన్ వేసింది అని, ఇందులో భాగంగా ఐసిస్ మ్యాగజైన్ ‘సాత్ అల్-హింద్’ కి వ్యాసాలు కూడా రాసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.