దేశ రాజధాని ఢిల్లీ లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కొద్దీ రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.కేంద్రం ఆదేశానుసారం మే 3 వరకు కొనసాగాల్సిన లాక్ డౌన్ పీరియడ్ ను మే 16 వరకు లాక్ డౌన్ ను కొనసాగించాల్సి ఉంటుంది అని కేజ్రీ వాల్ ప్రకటించగా తాజగా మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్,పంజాబ్,ఒడిశా రాష్ట్రాలు సైతం మే 3 తరువాత ఈ లాక్ డౌన్ పీరియడ్ ను కొనసాగించాలని భావిస్తున్నట్లుసమాచారం.
ఇప్పటికే తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణా లో లాక్ డౌన్ ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లో మాత్రం మే 16 వరకు ఈ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
అయితే మిగిలిన 5 రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కాలాన్ని మరికొద్ది రోజులు కొనసాగించాలని భావిస్తున్నాయి.ముంబై, పుణేలోని కంటెయిన్మెంట్ జోన్లలో మే 18 వరకు లాక్డౌన్ పొడిగించే ఆలోచనలో ఉన్నామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు.
దీనిపై ప్రధానితో సోమవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్లో చర్చించనున్నామని, అవసరమైతే కేవలం కంటెయిన్మెంట్ జోన్లలోనే మరో 15 రోజులు లాక్డౌన్ పొడిగించనున్నామని పేర్కొన్నారు.దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఏకంగా ఆ రాష్ట్రం 7 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మున్సిపాల్టీల వెలుపల దుకాణాలను తెరవాలనే కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాలను తమ రాష్ట్రంలో అమలుచేయబోమని మహరాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే అన్నారు.
మే 3 వరకు లాక్డౌన్లో ఎలాంటి సడలింపు ఇవ్వబోమంటూ ఆయన స్పష్టం చేశారు.మరోపక్క యూపీ ప్రభుత్వం సైతం షాప్ల తెరవడంపై వేచిచూసే ధోరణిలో ఉంది.
అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ ఆదేశాలపై నిర్ణయం తీసుకోనుంది.నిత్యావసరాలు, ఔషధాల దుకాణాలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని, ఇంకా ఎలాంటి వాటికి అనుమతులు ఇవ్వబోమని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, పంజాబ్ సైతం లాక్డౌన్ను మే 3 తర్వాత పొడిగించాలని కోరుతున్నట్లు సమాచారం.
.