దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతికి జనాలు అల్లాడిపోతున్నారు.అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు నిత్యం నమోదవుతున్నాయి.మరణాల శాతం పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ తరహాలో కఠిన నిబంధనలు విధించారు.
ఇక మరో మూడు వారాలు కరోనా ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో లాక్ డౌన్ దేశమంతా విధించాలనే డిమాండ్ పెరుగుతోంది.దీనికితోడు కరోనా పేషెంట్లకు చాలినంత ఆక్సిజన్ లభించకపోవడంతో, కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే ఆక్సిజన్ ప్లాంట్ ల నుంచి వివిధ రాష్ట్రాలకు రైళ్లు, విమానాలు ద్వారా ఆక్సిజన్ సరఫరా ఇప్పుడే మొదలైంది .ఈ వైరస్ తీవ్రత మరింత తీవ్రతరం అవుతున్న పరిస్థితుల్లో కేంద్రం అప్రమత్తమైంది.దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాా , నీతి అయోగ్ హెల్త్ మెంబర్ వి కె పాల్, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, హర్షవర్ధన్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అశోక్ గెహ్లాట్ పినరయి విజయన్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కరోనా కట్టడికి ఏం చేయాలనే దాని పైన చర్చ జరిగింది .ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగం తీవ్ర భావోధ్వేగం కలిగించింది.ఢిల్లీ లో కరోనా తీవ్రతరం అయిందని , ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోందని, కనీసం ఆక్సిజన్ సమస్యలను పరిష్కరించుకో లేకపోతే … పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, ముందు ముందు భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఢిల్లీని కాపాడాలి అంటూ ఆయన వేడుకోవడం ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కదిలించింది.
అసలు ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవని , అందువల్ల తమకు ఆక్సిజన్ ఇవ్వరా అంటూ ప్రధాని మోదీని కేజ్రీవాల్ నిలదీశారు.
ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ పరిస్థితుల్లో తాము ఎవరితో మాట్లాడాలో చెప్పాలంటూ సమావేశంలో కేంద్రం తీరును నిలదీశారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ తన ఆవేదనను పంచుకున్నారు.ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని, వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ లను సైన్యం స్వాధీనం చేసుకుని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని కేజ్రీవాల్ సూచించారు.
ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలో ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే తనను అందరూ క్షమించాలని కోరారు.