కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరింది.ఈ మేరకు ముగ్గురు సభ్యుల ఎన్ఐఏ బృందం .
కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదంతో పాటు హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ప్రమేయం వున్నందుకు గాను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రకారం ఎస్ఎఫ్జేను జూలై 2019లో భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
తమ కెనడా పర్యటన సందర్భంగా ఎస్ఎఫ్జేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని తాము ఆ దేశ ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద చేసిన అభ్యర్ధనలను వేగంగా అమలు చేయడం కోసం కెనడా అధికారులను ఒప్పించడమే ఎన్ఐఏ బృందం పర్యటన ముఖ్యోద్దేశమని సదరు అధికారు స్పష్టం చేశారు.
ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న సంస్థలు, వ్యక్తులపై దర్యాప్తులో మెరుగైన సమన్వయంతో పాటు ఇతర నేర సంబంధిత విషయాలను చర్చించడం కోసం ఈ పర్యటన జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కాగా.రైతుల ఆందోళన సందర్భంగా ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు జరిగిన మార్చ్ సందర్భంగా ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేసిన వారికి ఎస్ఎఫ్జే 2.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.85 కోట్లు) బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా.గతేడాది ఎస్ఎఫ్జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ, కేటీఎఫ్ నేత పరమ్జిత్ సింగ్ పమ్మా, హర్దీప్ సింగ్ నిర్జర్లను భారత ప్రభుత్వం తీవ్రవాదులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎస్ఎఫ్జే, బీకేఐ, కేటీఎఫ్, కేజడ్ఎఫ్ వంటి ఖలిస్తానీ సంస్థలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఈ కుట్రల కోసం యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఖలిస్తానీ గ్రూప్లకు భారీగా నిధులు అందుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
మరోవైపు ఖలిస్తాన్ గ్రూపులు బలంగా వున్న కెనడాకు ఇటీవల ముగ్గురు సభ్యుల ఎన్ఐఏ బృందం వెళ్లింది.ఈ గ్రూపులకు నిధులు వచ్చే మార్గాలపై నాలుగు రోజుల పాటు ఈ టీమ్ దర్యాప్తు చేయనుంది.ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం.సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే), బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజడ్ఎఫ్) , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) వంటి గ్రూపులకు సంబంధించి దర్యాప్తులో కనుగొన్న విషయాలను కెనడా అధికారులతో చర్చించనుంది.