తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కల్పించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం మొదలుపెట్టారు.
రాహుల్ ప్రయత్నంతో పాటు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ, ఇవన్నీ కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో బలపడేలా చేసి, అధికారం సంపాదించేందుకు మార్గాలుగా కనిపిస్తున్నాయి అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ పై పెరుగుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ కు వరంగా మారింది.ఇదిలా ఉంటే ఏపిలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉంది.
ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ కాంగ్రెస్ ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశ ఎక్కడా కనిపించడం లేదు.ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత అసలు కాంగ్రెస్ ను పట్టించుకునేవారు కరువవడంతో, ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ ప్రభావం జీరో అన్నట్లుగానే మారిపోయింది.
అసలు ఆ పార్టీని మిగతా పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోవడమే మానేశారు.అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావాలని రాహుల్ అభిప్రాయపడుతూ ఉండడంతో, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి వ్యవహారం చర్చకు వస్తోంది.
వైస్.రాజశేఖర రెడ్డి హయాం నుంచి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన రఘువీరారెడ్డి కాంగ్రెస్ 2014లో ఘోరంగా ఓటమి చెందినా, పిసిసి అధ్యక్షుడిగా కొంతకాలం పాటు ఆయన తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ కు కలిసి రాలేదు.
కాంగ్రెస్ పై ఉన్న నిరాసక్తత కారణంగా, రఘువీర పూర్తిగా సైలెంట్ అయిపోయారు.తన స్వగ్రామం నీలకంఠాపరం లో వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు.పూర్తిగా రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్నారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా , రెండు సార్లు మంత్రిగా ఐదేళ్ల పాటు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీర అకస్మాత్తుగా సైలెంట్ అయిపోవడంతో మళ్లీ ఆయనను యాక్టివ్ చేసేందుకు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు.
అయితే ప్రస్తుతం ఢిల్లీ నుంచి రాఘవీరాకు వర్తమానం అందడంతో మళ్ళీ యాక్టివ్ కావాలని, కాంగ్రెస్ కు ఏపీలో జీవంపోసేలా కృషి చేయాలంటూ పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిళ్లు వస్తున్నా, రఘువీరా మాత్రం పెదవి విప్పడం లేదు.ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినా, రఘువీర మాత్రం తన పొలిటికల్ సైలెన్స్ ను మాత్రం వీడకపోవడంతో, ఆయన ఏ స్టెప్ తీసుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది.