డాక్టర్లు ఒక వ్యక్తి చనిపోయారని ధృవీకరిస్తే.ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుంటారు.
నిజంగానే చనిపోయాడా అనే అనుమానాలు పెట్టుకోకుండా మృతుడి కుటుంబ సభ్యులు డాక్టర్లను పూర్తిగా నమ్మేస్తారు.అయితే ఒక్కోసారి డాక్టర్లు కూడా పప్పులో కాలేస్తారని కొన్నిసార్లు నిరూపితమైంది.
సజీవంగా ఉన్న వ్యక్తులను కూడా చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించిన దాఖలాలు ఉన్నాయి.
తాజాగా జరిగిన సంఘటన కూడా ఈ కోవకు చెందిందే.
ఉత్తరప్రదేశ్లోని వైద్యులు బతికి ఉన్న ఓ వ్యక్తిని చనిపోయినట్లు కన్ఫర్మ్ చేసిన ఉదంతమిది.ఆ రాష్ట్రంలోని ఓ నివాసి అయిన శ్రీకేష్ కుమార్ అనే వ్యక్తి మొరాదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు.
గురువారం నాడు అతడు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
అతన్ని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే శ్రీకేష్ పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు అతడు మరణించినట్లు ధృవీకరించారు.
మరుసటి రోజు పోస్ట్ మార్టం చేసేందుకు మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్లో ఉంచారు.అలా ఏడు గంటల పాటు శ్రీకేష్ భౌతిక కాయాన్ని ఫ్రీజర్ లోనే ఉంచారు.
తరువాత రోజు శవ పరీక్షకు అంగీకరిస్తూ కుటుంబ సభ్యులు పంచనామాపై సంతకాలు చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో మృతదేహాన్ని పరిశీలించి శ్రీకేష్ మరదలు ఒక్కసారిగా షాక్ కు గురయింది.శ్రీకేష్ చనిపోలేదని అతడు కదులుతున్నట్లు ఆమె గుర్తించింది.వెంటనే మిగిలిన కుటుంబ సభ్యులకు శ్రీకేష్ బతికే ఉన్నట్లు చెప్పింది.
అప్పుడు వారంతా శ్రీకేష్ బాడీని నిశితంగా పరిశీలించి ఆయన కదులుతున్నట్లు గమనించారు.తక్షణమే డాక్టర్లకు, పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో డాక్టర్లు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకేష్ను ఫ్రీజర్ నుంచి బయటకు తీసి.
మీరట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే అక్కడ చికిత్స పొందిన ఆయన కాస్త కుదుట పడ్డారు.ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే చనిపోయినట్టు అందరూ భావించగా శ్రీకేష్ మృత్యుంజయుడిగా నిలిచి ఆశ్చర్యపరిచాడు.
సకాలంలో కుటుంబ సభ్యులు గమనించడం వల్ల అతని ప్రాణాలు నిలిచాయి.ఏదేమైనా శ్రీకేష్ ప్రాణం గట్టిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అలాగే మరణించినట్లు ధృవీకరించిన డాక్టర్లను తిట్టిపోస్తున్నారు.