ఎక్కడి నుంచి వచ్చిందో కానీ కరోనా మహమ్మారి దాదాపుగా సంవత్సరం కాలం నుండి ప్రజలను పట్టి పీడిస్తోంది.ఇప్పటికే ఈ కరోనా వైరస్ ని అంతమొందించడానికి నానా అవస్థలు పడి వైద్యులు వ్యాక్సిన్ ను కనిపెట్టినప్పటికీ ప్రజలు ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయంపై స్పందించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి వైద్య అధికారులతో మాట్లాడారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులే ఇంకొంత కాలం పాటు కొనసాగితే ఖచ్చితంగా లాక్ డౌన్ విధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అంతేకాకుండా గడిచిన వారంలోనే దాదాపుగా వేల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కాబట్టి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియని మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అంతేకాకుండా ప్రజలకు సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై కనిపిస్తే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.అలాగే మాస్క్ ధరించకుండా బయట సంచరించ రాదని కూడా ఆదేశాలు జారీ చేశారు.కాగా 27 వ తారీఖున దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 166 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని, ఒకవేళ ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇప్పుడిప్పుడే గతంలో విధించిన లాక్ డౌన్ పరిణామాల నుంచి కోలుకుంటుండగా మరోమారు లాక్ డౌన్ అంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అయితే ప్రభుత్వం ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ మళ్ళీ కేసులు పెరగడం ఏమిటని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇంకొందరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కాబట్టి లాక్ డౌన్ విషయంలో మరో మారు పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.