మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కి అండర్ వరల్డ్ డాన్ ,ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తుంది.ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దావూద్ తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి నేరుగా బాంద్రాలోని ఉద్ధవ్ వ్యక్తిగత నివాసం అయిన ‘మాతోశ్రీ’కి ఫోన్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
శనివారం గం10:30 ని.సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి దుబాయ్ నుంచి దావూద్ మనిషిని అంటూ సీఎం ఉద్దవ్ తో దావూద్ మాట్లాడాలి అనుకుంటున్నారు అంటూ అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.అయితే సీఎం వ్యక్తిగత నివాసంకి మూడు సార్లు ఫోన్ రాగా ఫోన్ ఎత్తిన వ్యక్తి ఆ ఫోన్ ను సీఎం కు ఇవ్వకపోవడం తో ఈ గొడవ సద్దుమణిగింది.అయితే అసలు ఎవరు ఈ ఫోన్ కాల్ చేశారు అన్న వివరాల కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఫోన్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.
ఎవరైనా కావాలనే ఇలా ఫోన్ చేసి ఉంటారా లేదా మరేదైనా కారణం ఉండి ఉంటుందా అని అధికారులు ఆరా తీస్తున్నారు.మరోపక్క ఈ వార్త పై శివసేన నేత అనిల్ పరాబ్ తేలిగ్గా కొట్టిపారేశారు.
అది బహుశా వట్టి ఫేక్ కాల్ అయినట్టు కనిపిస్తోందన్నారు.అది అసలు బెదిరింపు కాల్ కాదని, ఆ కాల్ ని ఉధ్ధవ్ కి ఇవ్వాలని ఎవరో అజ్ఞాత వ్యక్తి కోరినా ఆపరేటర్ దాన్ని ఆయనకు ట్రాన్స్ ఫర్ చేయలేదని అనిల్ చెప్పారు.
ఉధ్ధవ్ థాక్రే తో దావూద్ మాట్లాడాలనుకుంటున్నాడని ఆ వ్యక్తి చెప్పాడని దుబాయ్ నుంచి అది అందినట్టు తెలుస్తోంది.ఇందులో బెదిరింపు ధోరణులు లేవు అని చెప్పిన అనిల్, ఏది ఏమైనా పోలీసులు ఈ కాల్ విషయమై ఇన్వెస్టిగేట్ మొదలుపెట్టారని తెలిపారు.