కోట్లాది మంది ప్రజలను పరిపాలించే ప్రభుత్వం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి.ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
ఒక సమాచారం పార్లమెంటులో చెబుతున్నప్పుడు దాన్ని నిర్ధారించుకొని చెప్పాలి.అంతర్జాతీయ వ్యవహారాల్లోనైతే మరింత జాగ్రత్తగా ఉండాలి.
ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చే సమాచారం అధికారికమైంది.అది ఉబుసుపోక ముచ్చట కాదు.
కాని మోదీ సర్కారు వైఖరి చూస్తే అది పిల్ల చేష్టలు చేస్తున్నట్లుగా కనబడుతోంది.పార్లమెంటు వేదికగా మాటలు మారుస్తూ పరువు పోగొట్టుకుంటున్నది.
అంతర్జాతీయ ఉగ్రవాది, చీకటి సామ్రాజ్య అధినేత, ముంబయి పేలుళ్ల మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తెలియడంలేదని, అతని కోసం వెతుకుతున్నామని చెప్పిన సర్కారు ఈరోజు అతను పాకిస్తాన్లోనే ఉన్నాడని, చట్టం ముందు నిలబెడతామని ప్రకటించింది.దావూద్ ఇబ్రహీంను భారత్కు రప్పించేంతవరకు తాము విశ్రమించబోమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గొప్పగా చెప్పారు.
దావూద్ పాక్లోనే ఉన్నాడనే విశ్వనీయ సమాచారం ప్రభుత్వం వద్ద ఉందన్నారు.దావూద్ ఎక్కడ ఉన్నాడో తెలియదని గతవారం హోం శాఖ ప్రకటించడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఎందకంటే దావూద్ ఎక్కడ ఉన్నాడో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు.అలాంటిది ప్రభుత్వానికి తెలియదంటే ఎంత సిగ్గుచేటు? వారం కిందట సమాచారమే తెలియని సర్కారుకు ఇప్పుడు సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే అది అసమర్థతగా పరిగణించాల్సివస్తుంది.మోదీ సర్కారు ప్రజలతో ఆటలాడటం మానుకుంటే మంచిది.