తాజాగా ఐపీఎల్ 2020 సీజన్ లో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పై ఓడిపోయింది.ఈ మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావోద్వేగం చెందాడు.
ఈ సిరీస్ మొదట్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎవరు ప్రధాన పోటీదారుగా భావించలేదని దాంతో తాము మంచి ప్రదర్శన ఇచ్చామని తెలిపాడు.ఇటువంటి ప్రతిభ కనబర్చినందుకు తనకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
సీజన్ మొదలైన సమయంలో కేవలం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టైటిల్ ఫేవరెట్స్ అనుకున్నారని అయితే ఆటగాళ్లు చక్కటి ప్రదర్శన తో ఇక్కడి వరకు రాగలిగారని వార్నర్ వెల్లడించాడు.ఇందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
తాజా ఐపీఎల్ సీజన్ లో బౌలర్ నటరాజన్ వెలుగులోకి వచ్చాడని అతడు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.ప్రతి సీజన్ లాగే మనీష్ పాండే, రషీద్ ఖాన్ మరోసారి ఆకట్టుకున్నారని వార్నర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అయితే ఈ సీజన్ లో తాము వదిలి పెట్టిన క్యాచ్ ల వల్లే కొన్ని మ్యాచ్ లను ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపాడు.ముఖ్యంగా ఈ సీజన్ లో తమ ఆటగాళ్లు గాయాల కారణంగానే దూరం కావడంతో ఈ సీజన్ లో ఇబ్బందులను ఎదురుకున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సేవలు కోల్పోవడంతో టీం కు భారీ దెబ్బ తగిలింది.దీంతో సన్రైజర్స్ జట్టుకు చాలా నష్టం వాటిల్లిందని తెలిపాడు.
భారత్ తనకు రెండో ఇల్లు, అని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన కుటుంబం అని తెలిపాడు.వచ్చే సంవత్సరం భారతదేశంలోనే ఐపీఎల్ జరగవచ్చు అని అప్పుడు మరింత ఉత్సాహంతో మళ్ళీ తిరిగి వస్తానని హామీ ఇచ్చాడు.క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాని చేదనలో చితికెల పడిన హైదరాబాద్ జట్టు కేవలం 172 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల ఓటమిని మూటగట్టుకుంది.దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడటానికి ఐపీఎల్ 2020 ఫైనల్ కు చేరుకుంది.