ఈ మధ్య కాలంలో తరుచుగా ప్రేమ వివాహాలు చూస్తూ ఉంటాం.అయితే కులాంతర వ్యక్తిని కూతురు ప్రేమించి ఇంటి పరువు తీసింది అంటూ తల్లిదండ్రులు ఆమె ప్రాణాలు తీయడం లేదంటే, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీయడం చేస్తూ ఉంటారు.
లేదంటే వారి ప్రాణాలు తీసుకుంటారు.ఇలాంటి పరువు హత్యలు తరుచుగా చూస్తూ ఉంటాం.
అయితే తల్లిదండ్రులే దగ్గరుండి చేసిన పెళ్లి చేశారు.పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు తమ కులం కాదనే విషయం వారికి తెలిసింది.
ఈ విషయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది.ఈ గొడవలో పెళ్లి కూతురు తండ్రి ఆమె తల్లి చేతిలో హతమయ్యాడు.
ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.జిల్లాలోని గురంధరపాలెంలో వ్యవసాయ కూలీ విసారపు చిరంజీవి, సన్యాసమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.పెద్దమ్మాయికి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు.చిన్నమ్మాయిని ఈనెల 3న మాకవరపాలెం మండలం పైడిపాలకు చెందిన అడ్డూరి చంటబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు.
అనూహ్యంగా కొత్తల్లుడి కులం సమస్యగా మారింది.పెళ్లి జరిగిన నాలుగు రోజుల తర్వాత కొత్త అల్లుడు తమ కులం కాదని తెలిసింది.
పెద్దలతో పంచాయితీ వరకు వెళ్ళింది.ఊళ్ళో పరువు పోయిందని భార్యాభర్తలు భావించారు.
ఈ కుల వివాదం భార్యభర్తల మధ్య గొడవకు కారణం అయ్యింది.కూతురి జీవితం పాడవడానికి కారణం నువ్వంటే నువ్వు అంటూ గొడవ పడ్డారు.
ఈ గొడవ ముదిరి పొలం పనిలో ఉండగా మళ్ళీ గొడవ పడ్డారు.భార్య సన్యాసమ్మ కత్తితో భర్తపై దాడి చేసింది.
ఆయన అక్కడే మరణించాడు.భర్తని హత్య చేసిన సన్యాసమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది.
ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.