తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకులు అనుకున్న వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బిజెపిలో చేరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.బిజెపి కూడా కాంగ్రెస్ నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని టిఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఈ మేరకు భారీ ఎత్తున చేరికలను కాంగ్రెస్ నుంచి ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ఇప్పటికే చేరికల కమిటీ కన్వీనర్ గా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు.
అనుకున్నట్లుగానే కాంగ్రెస్ నుంచి ఒక్కో కీలక నేత బయటకు వస్తున్నారు.బిజెపిలో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు.
ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.తన రాజీనామాకు రేవంత్ రెడ్డి వైకిరే కారణమని దాసోజు శ్రావణ్ విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ను సొంతం చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికోసం సొంత ముఠాను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని దాసోజు శ్రావణ్ విమర్శలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కులం, ధన ప్రభావం ఎక్కువ అయ్యాయని, ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆవేదన చెందారు.
సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి అధిష్టానాన్ని మోసం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, సర్వేల పేరుతో నాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ఇంత చేస్తున్నా… కొప్పుల రాజు, జయరాం రమేష్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని, రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.టీపీసీసీలో సొంత ముఠాను రేవంత్ తయారు చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని శ్రవణ్ ఆరోపణలు చేశారు.