తమిళ సూపర్ స్టార్ రిజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో రజినీ తన సత్తా ఏమిటో మరోసారి బాక్సాఫీస్ ముందు నిరూపించుకున్నాడు.
స్టార్ డైరెక్టర్ ఏఆర మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళనాట బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
అయితే తెలుగు జనాలకు ఈ సినిమా అంతగా ఎక్కలేదనే వార్త వినిపిస్తోంది.అసలే సంక్రాంతి పండగ సీజన్ కావడంతో ఇలాంటి రొటీన్ కథను వారు పెద్దగా పట్టించుకోవడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన దర్బార్ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ మహా అంటే రెండు రోజులు ఆదరిస్తారని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
జనవరి 9న రిలీజ్ అయిన దర్బార్ సినిమాకు తెలుగునాట మిక్సిడ్ టాక్ రావడంతో జనవరి 11న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు రజినీ దారి వదిలాడని అంటున్నారు సినీ జనాలు.
ఇక మరుసటి రోజు జనవరి 12న అల వైకుంఠపురములో సినిమా కూడా వస్తుండటంతో తెలుగు జనాలు అప్పటికి దర్బార్ సినిమాను పట్టించుకోవడం మానేస్తారని తెలుస్తోంది.అటు థియేటర్ల పంపకాల్లోనూ దర్బార్ సినిమాను లేపేసి రెండు తెలుగు సినిమాల్లో ఏదో ఒక బొమ్మ వేస్తారని అంటున్నారు.
ఏదేమైనా సంక్రాంతి పండగ సీజన్ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న మహేష్, బన్నీలకు రజినీకాంత్ దారి వదిలాడని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.మరి ఆ రెండు తెలుగు సినిమాలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో తెలియాలంటే మాత్రం సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.