రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ తో కార్పొరేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నారు.కరోనాతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి వచ్చిన బాధితులను వైద్యం పేరుతో రూ.
లక్షల్లో బిల్లు వేస్తున్నారు.కానీ కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు బాధితుడు మరణించినా బిల్లు కట్టేంతవరకు మృతదేహాన్ని కూడా అప్పగించడం లేదు.
ఈ ఘటన సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.ముషీరాబాద్ కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో ఆయన సికింద్రాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యాడు.22 రోజుల పాటు చికిత్స పొందుతున్నాడు.ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.అప్పటికే ఆయన ఆస్పత్రి ఖర్చు రూ.20 లక్షలు వేశారు.సెక్యూరిటీ గార్డుకు ఇన్సూరెన్స్ ఉండటంతో దాని ద్వారా రూ.11.5 లక్షలు కట్టారు.ఇంతకంటే ఎక్కువ చెల్లించలేమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.కానీ డాక్టర్లు కనికరించలేదు.మిగతా మొత్తం చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని అన్నారు.దీంతో 40 గంటల పాటు మృతదేహం వారి వద్దే ఉంది.
ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ కావడంతో క్రైస్తవ సంఘాల నాయకులు వైద్యారోగ్యశాఖకు ఫిర్యాదు చేశారు.అప్రమత్తమైన ప్రైవేట్ కార్పొరేషన్ యాజమాన్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, దుండిగల్ శ్మశాన వాటికలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.