టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని ఆనందించాలో లేక ఆ టెక్నాలజీని ఉపయోగించి అమాయకుల డబ్బులని కాజేస్తున్నారని బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి.ఇంట్లో దొంగలు పడి డబ్బులు కాజేస్తారని భయంతో బ్యాంకు లో దాచుకుంటున్నాము.
కానీ అక్కడ కూడా డబ్బును కాజేసే నేరగాళ్లు ఉంటారన్న విషయాన్నీ మనం గమనించడం లేదు.ఈ ఆధునిక కాలంలో మానవుడు ఏది నిజం… ఏది అబద్దం అనే గందరగోళంలో బతకాలిసిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.?
దీనికి నిదర్శనంగా హైదరాబాద్ లో ఒక ఘరానా మోసం బయటపడింది.అసలు వివరాలలోకి వెళితే ఒక ఫేక్ ఈ-మెయిల్ ఐడీతో హైదరాబాద్కి చెందిన ఓక వ్యాపారి దగ్గర రూ.60 లక్షల రూపాయల కాజేశారు సైబర్ నేరగాళ్లు.హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన శేషగిరిరావు అనే వ్యాపారి గత కొంతకాలంగా ట్రైక్యాడ్ డిజైన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు.ఈయనకు గత 15 సంవత్సరాలనుండి అమెరికాకు చెందిన గ్లోబల్ జియో సప్లయిస్ సంస్థ 3డీ సాఫ్ట్ మౌస్లు దిగుమతి చేస్తుంది.
అయితే కొన్ని రోజుల క్రితం శేషగిరిరావుకు చెందిన అధికారిక ఈ-మెయిల్ కు సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ చేశారు.కానీ ఆ విషయం శేషగిరిరావు కనిపెట్టలేకపోయారు.
అయన అధికారిక ఈ -మెయిల్ నుంచి సైబర్ నేరగాళ్ళు విలువైన సమాచారం సేకరించారు.శేషగిరిరావు అమెరికా సంస్థతో చేస్తున్న వ్యాపార లావాదేవీలు గూర్చి తెలుసుకున్నారు.
ఇంకేముంది నేరగాళ్లు రెచ్చిపోయారు.
అమెరికా సంస్థ అధికారిక ఈ-మెయిల్ ఐడీని పోలిన మరో దొంగ ఐడీని క్రియేట్ చేసి దాన్నుంచి ఈ నెల 8న శేషగిరిరావుకు సైబర్గాళ్లు ఓ మెయిల్ పంపారు.ఆ మెయిల్ లో తమకు చైనా సంస్థతోనూ లావాదేవీలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ దేశంపై అమెరికాలో ఆంక్షలు విధించిన కారణం చేత అక్కడి నుంచి తమకు అవసరమైన సరుకును మీరు దిగుమతి చేసుకుని, ఆ సరుకు భారత్ నుంచి వస్తున్నట్లు అమెరికాకు ఎగుమతి చేయాలని సూచించారు.అందులోనే చైనాకు చెందిన సంస్థ పేరుతో ఓ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచి ఆ ఖాతాలోకి 79,800 డాలర్లు అనగా భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షలు జమ చేస్తే మీకు చైనా నుంచి సరుకు వస్తుందంటూ నమ్మించారు.అది నిజమని నమ్మిన శేషగిరిరావు నేరగాళ్లు పంపిన ఖాతాలోకి ఆ మొత్తం జమ చేశాడు.
ఇది జరిగిన రెండు రోజులకు మళ్ళీ స్పేర్ పార్ట్స్ పంపడానికి మరికొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఇంకో మెయిల్ పంపారు.దీంతో అనుమానం వచ్చి ఆ వ్యాపారి తనకు వచ్చిన మెయిల్ ఐడీ ఫేక్ అని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్నారు.