సైబర్ నేరగాళ్లు ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తూ మెల్లగా తమ ఉచ్చులోకి వారిని లాగేస్తున్నారు.చిన్న అవకాశం ఇచ్చిన వారి చేతిలో మనం మటాష్ అయిపోయినట్లే.
అంతగా పకడ్బందీ ప్లాన్ తో టార్గెట్ చేస్తూ మన దగ్గర ఉన్న డబ్బులని మనకి తెలియకుండానే కొట్టేస్తున్నారు.అలాగే ఏవేవో ఆశ చూపించి మన చేతుల మీదుగానే వారికి డబ్బులు ఇచ్చేలా చేసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు, అలాగే అత్యాశకి పోయేవాళ్లు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.ఇలాంటి అనుభవం ఓ వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి ఎదురైంది.
అయితే ఆమె అప్రమత్తంగా ఉండటంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకుంది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఇటీవల ఒక వ్యక్తి ఫోన్ చేశాడు.
ప్రధానమంత్రి పథకం కింద రుణాలు ఇప్పిస్తానని, 2 లక్షలు డిపాజిట్ చేస్తే 3 కోట్ల రుణం ఇస్తారంటూ టోకరా వేసేందుకు ప్రయత్నించాడు.అయితే అతడి మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించి, కేంద్ర పథకాలపై ఆరా తీశారు.
వారు చెప్పిన వివరాలతో అదంతా మోసమని గుర్తించి, ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా విచారణ షురూ చేశారు.
తెలంగాణలోనూ ఇదే తరహాలో పలువురు ఎంపీలను మోసం చేసిన సంగతి తెలిసిందే.మొత్తానికి ఆమె ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఈజీగా సైబర్ నేరగాడి మోసం నుంచి బయటపడింది.
లేదంటే అత్యాశకి పోయేవాళ్లు ఉంటే కచ్చితంగా చేతి సొమ్ము పోగొట్టుకునేవారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.