ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.2016లో ఓ రోజున దిగ్గజ టెక్ కంపెనీలు ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి సేవలు నిలిచిపోయాయి.ఏం జరుగుతుందో తెలియక కోట్ల మంది వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.చివరికి నగదు ట్రాన్స్ఫర్ కోసం వినియోగించే పేపాల్ పనిచేయకపోవడంతో అయోమయం నెలకొంది.ఇంటర్నెట్కు అనుసంధానమైన వెబ్కామ్లు, రూటర్లు, సెట్టాప్ బాక్సులు, డీవీఆర్ల సాయంతో హ్యాకర్లు సైబర్ దాడి చేసినట్లు నిపుణులు గుర్తించారు.ఈ ఒక్క ఘటనలో వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.
ఆ తర్వాత 2020 మార్చి-జూన్ మధ్యలో హ్యాకర్లు సోలార్ విండ్ అనే నెట్వర్కింగ్ సేవల సంస్థకు చెందిన ‘ఓరియన్’ సాఫ్ట్వేర్లోకి ‘సన్బరస్ట్’ అనే హానికారక మాల్వేర్ చొప్పించడంతో అవి వారి ఆధీనంలోకి వెళ్లాయి.
తాజాగా అమెరికాలోని అతిపెద్ద చమురు పైప్లైన్ హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లి మూతపడింది.
దేశ తూర్పు తీరంలోని కలోనియల్ పైప్లైన్ దేశ ఆర్ధిక వ్యవస్ధకు జీవనాడి వంటిది.టెక్సాస్ నుంచి న్యూజెర్సీ వరకు సుమారు 5,500 కిలోమీటర్ల మేర ఇది చమురు సరఫరా చేస్తూ దేశ ప్రజల అవసరాలు తీరుస్తోంది.
అధికారిక గణాంకాల ప్రకారం ప్రతినిత్యం 25 లక్షల బ్యారళ్ల పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్ని సరఫరా చేస్తుంది.దీనిపై దాడి చేసిన కేటుగాళ్లు ఈ మార్గాన్ని మూసివేశారు.
దీంతో 18 రాష్ట్రాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోనున్నాయి.ఈ క్రమంలో ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
రోడ్డు, రైలు, ఇతర మార్గాల ద్వారా చమురును పంపిణీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.మరోవైపు ఈ దాడి కారణంగా దేశంలో చమురు ధరలు దాదాపు 3 శాతం వరకు పెరిగే అవకాశం వుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రష్యాకు చెందిన ‘ది డార్క్సైడ్’ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.కలోనియల్ పైప్లైన్లోని ఒకరి అకౌంట్ లాగిన్ లేదా టీమ్వ్యూయర్ వంటి రిమోట్ డెస్క్టాప్ ద్వారా వారు ఈ దాడికి పాల్పడినట్లు నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం కలోనియల్ పైప్లైన్ నెట్వర్క్కు చెందిన దాదాపు 100 గిగాబైట్ల డేటా వీరి ఆధీనంలో వున్నట్లుగా సమాచారం.ప్రమాద తీవ్రతను పసిగట్టిన సదరు కంపెనీ మిగిలిన డేటా హ్యాకర్ల బారినపడకుండా ఆఫ్లైన్ చేసింది.
కాగా, తమ దగ్గర వున్న డేటాను వెనక్కి ఇవ్వాలంటే నగదు చెల్లించాలని హ్యాకర్లు కంపెనీ ఎదుట డిమాండ్ వుంచారు.లేనిపక్షంలో ఆ డేటాను ఇంటర్నెట్లో ఉంచుతామని బెదిరించారు.
దీనిపై కంపెనీ, అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.