సైబర్ నేరగాళ్లు అందరి జేబులకు చిల్లులు పెట్టినట్టే సినిమా వాళ్ళపై కూడా పంజా విసురుతున్నారు.చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాని థియేటర్ల కంటే ముందుగానే ఇంటర్నెట్లో విడుదల చేసి దర్శక నిర్మాతలకు భారీ నష్టాన్ని చేకూరుస్తున్నారు.
ఈ పైరసీ కి పాల్పడే కేటుగాళ్ల కారణంగా ఎంతోమంది సినిమా వాళ్లు నష్టపోయారు.లేడీస్ నాట్ అలోడ్ సినిమా రెండు రోజుల్లోనే పైరసీ సైట్లలో ప్రత్యక్షమయ్యే సరికి షకీలా కూడా కన్నీరుమున్నీరు అయ్యింది.
కానీ ఎవరూ కూడా పైరసీ భూతానికి చెక్ పెట్టలేకపోతున్నారు.తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా కు సంబంధించిన సన్నివేశాలు కూడా థియేటర్లలో విడుదల కాకముందే ఇంటర్నెట్ వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి(అభినయ కృష్ణ) కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులయ్యారు.అదిరే అభి, గడ్డం నవీన్ పాయింట్ బ్లాంక్ సినిమాలో ప్రధాన పాత్రలను పోషించారు.
ఈ సినిమాని ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించారు.వి.వి.ఎస్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మల్లిక్ చింతకుంట కథ సమకూర్చారు.సాయి పవన్ సంగీతం అందించారు.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి పి.సి.కన్నా సినిమాటోగ్రఫీ అందించారు.‘పాయింట్ బ్లాంక్‘ సినిమాతో హీరోగా మారబోతున్న అదిరే అభి పోలీస్ పాత్రలో నటించారని సమాచారం.
అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే థియేటర్లలో విడుదల కాబోతుండగా.కొంతమంది సైబర్ నేరగాళ్లు మూవీ మొత్తాన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మరియు పైరసీ వెబ్ సైట్ లలో విడుదల చేశారు.ఈ విషయం తెలుసుకొని చిత్రబృందం షాక్ అయింది.
ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమా లీక్ అయింది అని తెలిసి దర్శక నిర్మాతలతో పాటు అదిరే అభి, గడ్డం నవీన్ బాగా బాధ పడి పోయి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు.ఈ పైరసీ నేరగాళ్ల పై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని.
ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న తమ సినిమా ప్రింట్ ని తీసేయాలని కోరారు.